హసన్ పర్తి,వెలుగు: “నోట్లకు అమ్ముడుపోయే ఓట్లు.. మా ఇంట్లో లేవు’’ అంటూ ఓ కుటుంబం వినూత్నంగా ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుంది. ఇది పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అందరినీ ఆలోచింప చేస్తోంది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మడిపల్లికి చెందిన కాందారి రమేశ్ కుటుంబం తమ ఇంటి ముందు కిటికీకి ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది.
అందులో ‘నేను మడిపల్లి గ్రామ వాసిని, నోట్లకు అమ్ముడుపోయే ఓట్లు మా ఇంట్లో లేవు.. ఓట్ల కోసం నోట్లు పట్టుకొని మా ఇంట్లోకి ఎవరూ రాకండి.. తస్మాత్ జాగ్రత్త’ అని రాసి ఉంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో ఊరి బాగు కోసం, అభివృద్ధి కోసం ఆరాటపడే వ్యక్తిని మాత్రమే సర్పంచ్ గా గెలిపించుకోవాలని, ఓటు విలువ ను ప్రజలకు తెలియజేసేందుకే ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని రమేశ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
