
బోధన్, వెలుగు: ఆరు నెలలవుతున్నా తన భూమి హద్దులు చూపించడం లేదని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఓ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కుమ్మర్ గల్లీకి చెందిన రైతు బోదు గణేష్. పట్టణ శివారులో 9 గుంటల భూమి గణేష్ తాత బోదు పెద్ద గంగారాం ఆయనకు రాసిచ్చారు. అక్కడ కొందరు ఇండ్లు నిర్మించుకున్నారు. తన భూమికి హద్దులు చూపించాలని రెవెన్యూ అధికారులకు గణేష్ ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఎంతకీ పని కాకపోవడంతో విసిగిపోయి బుధవారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట తన ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది వెంటనే అతనిపై నీళ్లు పోసి కడిగేశారు. తహసీల్దార్ గఫార్ మియా బయటకు వచ్చి ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరించారు. కరోనా ఉండడంతో ఆలస్యమైందని తెలిపారు. సరిహద్దుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి రైతును అక్కడి నుంచి పంపించేశారు.