- షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిన రాజధాని బస్సు
- డీజిల్ బంకులోనే ప్రమాదం
- సుమారు రూ.50 లక్షల నష్టం
కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ డిపోలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్సర్క్యూట్తో మంటలంటుకోవడంతో రాజధాని బస్సు పూర్తిగా కాలిపోగా, మరో ఎక్స్ప్రెస్ పాక్షికంగా దగ్ధమైంది. డీజిల్ బంకులో ప్రమాదం చోటుచేసుకోగా అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. ఆర్టీసీ సిబ్బంది కథనం ప్రకారం..కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన రాజధాని బస్సు ఆదివారం ఉదయం 6 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు కోరుట్లకు వచ్చింది. బస్టాండ్లో ప్రయాణికులను దింపి డిపోకు వెళ్లింది.
బంకులో డీజిల్ పోయించుకున్నాక మెయింటనెన్స్ చూసే మెకానిక్ సిబ్బంది వచ్చి బస్సులో కూర్చుని సెల్ఫ్చూశారు. అది రాకపోవడంతో రిపేర్ చేస్తున్నారు. ముగ్గురు చెక్ చేసినా పని కాలేదు. అంతలోనే బస్సు బ్యాటరీల్లో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్స్టేషన్కు, పోలీసులకు సమాచారమిచ్చారు. మెట్పల్లిలో ఫైర్స్టేషన్ ఉండడంతో 15 నిమిషాల్లో రావాల్సిన ఫైరింజన్ 45 నిమిషాలకు వచ్చింది. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సు కు హ్యాండ్బ్రేక్ వేసి ఉండడంతో ముందుకు కదల్లేదు. దీంతో రెండు జేసీబీల సాయంతో బంకు నుంచి గ్యారేజీలోకి తీసుకెళ్లడంతో భారీ ప్రమాదం తప్పింది. తహసీల్దార్ కిషన్, సీఐ ప్రవీణ్కుమార్, కోరుట్ల , మెట్పల్లి డీఎంలు విజయ మాధురి, వేదవతి వచ్చి పరిశీలించారు. దాదాపు రూ.50 లక్షల వరకు నష్టం వాటిలినట్లు అధికారులు తెలిపారు.