
- భర్త హత్యకు భార్య సుపారీ
- రాజా రఘువంశీ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
- మర్డర్ ప్లానింగ్ లో భాగంగానే హనీమూన్ ట్రిప్
- మే 23న మర్డర్, మే 25న ఇండోర్ కు తిరిగొచ్చిన సోనమ్
షిల్లాంగ్/ ఇండోర్, ఘాజీపూర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలు భార్యేనని, భర్త హత్యకు రూ.20 లక్షలతో సుపారీ కుదుర్చుకుందని తాజాగా బయటపడింది. రాజా రఘువంశీని అంతమొందించాలని సోనమ్ తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే హనీమూన్ వెళ్దామని పట్టుబట్టిందని చెప్పారు. ఇండోర్లోని తమ కుటుంబానికి చెందిన కంపెనీ వర్కర్లను షిల్లాంగ్ పిలిపించి, నిందితులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ ప్లాన్ అమలు చేసిందని తెలిపారు. ఈ వ్యవహారం మొత్తాన్నీ సోనమ్ ప్రియుడు రాజేశ్కుశ్వాహా ఇండోర్ నుంచే పర్యవేక్షించాడని వివరించారు.
మే 23న షిల్లాంగ్ లోని అటవీ ప్రాంతంలో రాజా రఘువంశీ మర్డర్ జరగగా.. భర్త శవాన్ని లోయలో పడేయడంలో సోనమ్ హంతకులకు సాయం చేసిందని, ఆపై మే 25న ఇండోర్ తిరిగి వచ్చి సిటీలోనే తలదాచుకుందని పోలీసులు చెప్పారు. కొత్త జంట కనిపించకుండా పోవడంపై రాష్ట్రంలో కలకలం రేగగా మేఘాలయ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 2న రాజా డెడ్ బాడీని గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. రాజా అంత్యక్రియల్లో సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా పాల్గొన్నాడని పోలీసులు తర్వాత గుర్తించారు.
మే 23న ఏం జరిగిందంటే..
హనీమూన్ కోసం మేఘాలయ వచ్చిన రాజా, సోనమ్ మే 22 రాత్రి నాంగ్రియట్ గ్రామంలో ఓ హోంస్టేలో బసచేశారు. మే 23న ఇద్దరూ ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. అప్పటికే కిరాయి హంతకులు ఆకాశ్, ఆనంద్, వికాస్ షిల్లాంగ్ చేరుకున్నారు. వారిలో ఒకరితో సోనమ్ ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ తన లైవ్ లొకేషన్ షేర్ చేస్తూ వచ్చింది. ట్రెక్కింగ్కు బయలుదేరిన రాజా, సోనమ్లకు మార్గంమధ్యలో ఈ ముగ్గురూ కలిశారు. తాము కూడా ట్రెక్కింగ్కేనని రాజాను మాటల్లో పెట్టి జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సోనమ్ ఆదేశాలతో ఆ ముగ్గురూ రాజాపై కత్తితో దాడి చేసి చంపేశారు.
ఆపై రాజా డెడ్ బాడీని లోయలో పడేసేందుకు సోనమ్ వారికి సాయం చేసింది. తర్వాత నిందితులు ఎవరిదారిన వారు వెళ్లిపోగా.. సోనమ్ తొలుత గువాహటికి, అక్కడి నుంచి మే 25న ఇండోర్కు చేరుకుంది. ప్రియుడు రాజ్ కుశ్వాహా తన కోసం అరేంజ్ చేసిన ఓ గదిలో తలదాచుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ సమీపంలో ఓ డాబా వద్ద పోలీసులకు సరెండర్ అయింది. అయితే, ఇండోర్ నుంచి సోనమ్ ఘాజీపూర్ ఎలా చేరుకుందనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం సోనమ్ను, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహ, హంతకులు ఆకాశ్, ఆనంద్, వికాశ్లను పోలీసులు విచారిస్తున్నారు.
ప్రియుడితో లేచిపోవచ్చుగా..
ఆల్రెడీ ప్రియుడు ఉండగా రాజాతో సోనమ్ వివాహానికి ఎందుకు ఒప్పుకుంది..? పెళ్లి అయ్యాకైనా ప్రియుడి తో పారిపోవచ్చుగా.. తన సోదరుడిని ఎందుకు చంపించింది? ఏడేడు జన్మలకు తోడుంటానని సోనమ్కు రాజా మాటివ్వగా.. సోనమ్ మాత్రం 7 రోజులు కూడా కలిసి ఉండలేకపోయిందంటూ రాజా రఘువంశీ సోదరి శ్రస్తి ఓ వీడియోలో కన్నీటి పర్యంతమైంది. రాజా అంత్యక్రియల్లో సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా ఆమె తండ్రిని ఓదార్చుతూ కనిపించాడని ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.