- తప్పిన ప్రాణాపాయం.. రూ. కోట్లలో ఆస్తినష్టం
- 8 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పిన పోలీసులు
- కాటేదాన్ పారిశ్రామికవాడలో ఘటన
శంషాబాద్, వెలుగు : కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ బిస్కెట్ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విధుల్లో ఉన్న కార్మికుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. భారీగా ఆస్తినష్టం జరిగిన ఘటన మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. కాటేదాన్ లోని రవి ఫుడ్స్(ఫాహాల్ పోడ్స్) కంపెనీ నాలుగో ఫ్లోర్లలో ఉండగా.. రెండో ఫ్లోర్ లోని ప్యాకింగ్ మెటీరియల్ విభాగంలో గురువారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో సుమారు 1000 మంది కార్మికులు కింది ఫ్లోర్ లో విధులు నిర్వహిస్తున్నారు. వారు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు.
యాజమాన్యానికి చెప్పగా.. ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. 8 ఫైర్ ఇంజన్లతో పోలీసులు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ బిస్కెట్ కంపెనీని పరిశీలించారు. అనంతరం కంపెనీ సిబ్బంది మాట్లాడుతూ.. ఒక్క కార్మికుడు కూడా గాయపడలేదని, అయితే.. ఆస్తి నష్టం భారీగా జరిగిందని తెలిపారు. ఘటనకు గల కారణాలను పరిశీలించి, మరోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.