క్రాకర్స్ దుకాణంలో మంటలు.. కాలి బూడిదైన షాపులు

క్రాకర్స్ దుకాణంలో మంటలు.. కాలి బూడిదైన షాపులు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ పరిధిలోని సన్ సిటీ వద్ద ఉన్న క్రాకర్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. పక్కనే అనుకుని ఉన్న ఓ ఫుడ్ కోర్టుకు మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు వ్యాపించిన ఫుడ్ కోర్టులో సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక చాలా సేపు ఆందోళనకు గురయ్యారు. 

పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలియగానే వెంటనే ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో మరో మూడు దుకాణాలు కూడా కాలిపోయాయి. 

షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అనుమతులు లేకుండా క్రాకర్స్ దుకాణం ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది. మంటలు ఆర్పివేయడం అగ్నిమాపక సిబ్బందికి చాలా కష్టంగా మారింది.