దుండిగల్​లో వ్యక్తి దారుణ హత్య

దుండిగల్​లో వ్యక్తి దారుణ హత్య

దుండిగల్, వెలుగు: వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా చించొలి మండలం ఐనోలి గ్రామానికి చెందిన బలిజ శరణప్ప(50) కొంతకాలంగా బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నాడు. బాచుపల్లిలోని ఓ బార్​లో వెయిటర్​గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి బయటికెళ్లిన శరణప్ప తిరిగిరాలేదు. దీంతో అతడి భార్య కోమల చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికింది.

ఎక్కడా శరణప్ప ఆచూకీ దొరకలేదు. సాయంత్రం 4 గంటలకు బౌరంపేటలోని లహరి వెంచర్ దగ్గర చెట్లపొదల్లో ఓ డెడ్​బాడీ ఉన్నట్లు తెలుసుకున్న కోమల అక్కడికి వెళ్లి చూసింది. తన భర్త డెడ్​బాడీగా గుర్తించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు శరణప్ప డెడ్ బాడీని పరిశీలించారు. అతడు హత్యకు గురైనట్లు గుర్తించారు. నిందితులను తొందరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.