
సమయస్ఫూర్తి ఎన్నో అనర్థాల నుంచి కాపాడుతుంది. కొన్ని సార్లు ప్రాణాల నుంచి కూడా రక్షిస్తుంది. హైదరాబాద్ నిమ్స్ లో కూడా అదే జరిగింది. టెస్టుల కోసం వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలడంతో.. నిమ్స్ కార్మికుడు సమయస్ఫూర్తి వ్యవహరించి ప్రాణాలు కాపాడాడు. దీంతో ‘‘మా ప్రాణాలు కాపాడిన దేవుడివయ్యా.. ’’ అంటూ కార్మికుడికి దండం పెట్టుకున్నారు ఆ భార్యభర్తలు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండల్ పెద్ద నక్కల పేట్ గ్రామానికి చెందిన బగ్గీ అశోక్ తన భార్య లక్ష్మితో కలిసి బుధవారం (జూన్ 18) నిమ్స్ కు వచ్చారు. జనరల్ మెడిసిన్ విభాగంలో వైద్య పరీక్షల కోసం ఓపిడి కౌంటర్ ముందు నిల్చున్నారు. అకస్మాత్తుగా అశోక్ గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు.
దీంతో అక్కడే ఉన్న కార్మికుడు శ్రీనివాస్ వైద్యుల కోసం ఎదురు చూడకుండా సీపీఆర్ చేసి బతికించాడు. వెంనటే ట్రాలీలో AMC వార్డ్ కు తీసుకెళ్లి అడ్మిట్ చేయగా డాక్టర్లు అతనికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించి రోగి ప్రాణాలు కాపాడిన శ్రీనివాస్ ను నిమ్స్ డైరెక్టర్ నగరి భీరప్ప ప్రత్యేకంగా అభినందించారు. సీపీఆర్ చేయకుంటే పరిస్థితి చేయిదాటిపోయేదని.. శ్రీనివాస్ చేసిన పని అందరికీ ఆదర్శమని చెప్పారు. రోగి అశోక్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది.. కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.
నిమ్స్ లో ఓపీడీ 32వ రూమ్ లో పని చేసే కార్మికుడు శ్రీనివాస్ సీపీఆర్ ద్వారా రోగి ప్రాణాలను కాపాడాడు. దీంతో అశోక్ భార్య లక్ష్మి, వారి బంధువులు శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాస్ సమయస్ఫూర్తికి తోటి ఉద్యోగులు అభినందనలు తెలిపారు.