
- కాలుష్య కాసారంగా చింతల కుంట చెరువు
- మృత్యువాత పడుతున్న చేపలు
- ఆందోళనలో మత్య్సకారులు
- ఇరిగేషన్ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం
మేడిపల్లి, వెలుగు : చెంగిచెర్లలోని చింతలకుంట చెరువులో ఆదివారం భారీ స్థాయిలో చేపలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల చెరువు పరిసర ప్రాంతాల్లో వెలసిన కాలనీల నుంచి పెద్ద ఎత్తున డ్రైనేజీ నీరు చెరువులో కలుస్తుండటంతో కాలుష్యం పేరుకుపోతుందన్నారు. డ్రైనేజీ నీరు చెరువులోకి రాకుండా ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్ఎన్పీ పనులు పూర్తిగా ఆగిపోయాయన్నారు.
చెరువులోకి డ్రైనేజీ నీరు చేరకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, బోడుప్పల్ కార్పొరేషన్ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని మత్య్యకారుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం ప్రతినిధులు దుడ్డెల ధశరథరాం, నాసబోయిన కుమార్ మాట్లాడుతూ.. చేపల మృత్యువాతతో మత్య్సకారుల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని వాపోయారు. నష్టపోయిన మత్య్సకారుల కుటుంబాలను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.