
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్లో షాపింగ్ చేసిన ఓ వ్యక్తి.. 5 తులాల బంగారం ఆర్డర్ పెడితే.. కొరియర్ లో ఖాళీ డబ్బా వచ్చింది. దీంతో బాధితుడు కన్జుమర్ఫోరమ్ను ఆశ్రయించాడు. కేసును విచారించిన ఫోరం, సంబంధిత వ్యాపార సంస్థపై కొరడా ఝలిపించింది. కన్జుమర్ కట్టిన డబ్బును ఏడాదికి 18 శాతం వడ్డీతో చెల్లించడంతో పాటు మరో రూ.50 వేలు, కోర్టు ఖర్చుల కింద ఇంకో రూ.10 వేలు ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఫోరం అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన రవిచంద్ర ప్రైవేట్ ఎంప్లాయ్. హైదరాబాద్కు చెందిన షాపర్స్ స్టాప్ వెబ్సైట్లో 2016, డిసెంబర్ 12న ఐదు తులాల మలబార్ గోల్డ్ కొనుగోలు కోసం రూ.1,53,091 చెల్లించాడు. ఆర్డర్ చేసిన 7 పని దినాల్లోపు డెలివరీ అవుతుందని షాపర్స్ స్టాప్ నుంచి రవిచంద్రకు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత అదే నెల 22న అరామెక్స్ కొరియర్ నుంచి పార్శిల్ పంపుతున్నట్లు షాపర్స్ స్టాప్ నుంచి మరో మెసేజ్ వచ్చింది. కానీ 26న రాత్రి 7.30 గంటలకు ఇ-కామ్ ఎక్స్ప్రెస్ కొరియర్ సర్వీస్ నుంచి ఒక వ్యక్తి ట్రాకింగ్ నంబర్తో కూడిన ఒక ప్యాకెట్ను డెలివరీ చేశాడు. పార్శిల్ అందుకున్న రవిచంద్ర అనుమానంతో వీడియో తీస్తూ.. ప్యాకెట్ను తెరవగా ‘ఎం’ అనే అక్షరంతో ఉన్న చిన్న బాక్స్ ఉంది. దాన్ని తెరిచి చూస్తే.. ఇన్ వాయిస్ పేపర్లు మాత్రమే ఉన్నాయి. వెంటనే రవిచంద్ర, కస్టమర్ సపోర్ట్ సెంటర్కు సమాచారమిచ్చారు. పార్శిల్ ఫొటోలు అడగ్గా.. తాను తీసిన వీడియో పంపాడు. స్పందన రాకపోవడంతో సంబంధిత సంస్థకు రనోటీసులు పంపగా.. తమకు సంబంధం లేదని, కొరియర్ సంస్థ తప్పంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో బాధితుడు 2017లో ఫిబ్రవరి 15న హైదరాబాద్ జిల్లా వినియోగదారుల ఫోరం–1ను ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఫోరం, బాధితుడు చెల్లించిన రూ.1,53,091ని ఆర్డర్ పెట్టిన తేదీ నుంచి ఏటా 18 శాతం వడ్డీతో రీఫండ్ చేయాలని ఆదేశించింది. దీనిపై షాపర్స్ స్టాప్ యాజమాన్యం స్టేట్ కన్జుమర్ ఫోరానికి అప్పీల్కు వెళ్లగా.. కేసును విచారించి, జిల్లా ఫోరం తీర్పును సమర్థిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది