‘మీరు పంపిన ఫొటోని మెమొంటోలా దాచుకుంటాను’ అన్నారు రావులపాటి సీతారామారావుగారు. ఈ మాటలు అన్నది 2024 జులై 25న రోజున. ఆయన పోలీస్ అధికారి కన్నా రచయితగా ఎక్కువ పరిచయం.మా బావ, ఆయన ఒకేసారి పోలీసు అధికారులుగా సెలక్ట్ అయ్యారు.ఆ విధంగా కూడా ఆయన నాకు బాగా పరిచయం.
ఇంతకీ ఆ ఫొటో ఏమిటీ? అది తెలుగు కథకుల ఒక అరుదైన ఫొటో. దాదాపు నలభై మంది వరకు ఆ ఫొటోలో ఉంటారేమో. వాళ్లు కాకుండా అక్కడికి మరో పదిమంది వరకు వచ్చారు. కానీ.. ఫొటో తీసే సమయానికి వాళ్లు లేరు. ముఖ్యంగా కె.ఎన్.వై పతంజలి, వి. రాజా రామ్మోహనరావు.. ఇంకా కొంతమంది ఫొటో తీసే సమయానికి లేరు. ప్రతి సందర్భంలో ఫొటోలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫొటో గుర్తుచేస్తుంది. మనం మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలని చెబుతుంది. మరెన్నో విషయాలను గుర్తు చేస్తుంది. మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ ఫొటో తీసుకోవడానికి ప్రధాన కారకులు ప్రముఖ కథా రచయిత శ్రీపతి. ఆయన కథల పుస్తకం ‘మంచు పల్లకీ.. మరి తొమ్మిది’ పుస్తకం ద్వారా శ్రీపతి గారు నాకు చిన్నప్పుడే పరిచయం. ఆ పుస్తకాన్ని ఎం. శేషాచలం అండ్ కంపెనీ వాళ్లు ప్రచురించారు. అది మా ఇంట్లో ఉండేది. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆయన కథలు చదివాను. అందులో నాకు బాగా ఇష్టమైన కథ ‘కుర్చీ’. విరసం వ్యవస్థాపక సభ్యుల్లో శ్రీపతి ఒకరు. చాలా కథలు రాశారు. నేను హైదరాబాద్లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్గా పనిచేస్తున్నప్పుడు ఒకసారి మారేడ్పల్లిలోని జడ్జెస్ క్వార్టర్స్కి వచ్చి పలకరించారు. సీనియర్ కథా రచయిత అంత సింపుల్గా రావడం నాకు కొంత ఆశ్చర్యాన్ని, మరెంతో ఆనందాన్ని కలగజేసింది. ఆ తర్వాత తరచూ కలుస్తుండేవాళ్లం. ఆయనే నాకు కవి ముకుంద రామారావుని పరిచయం చేశారు. నన్నూ, వాకాటి పాండురంగారావుని తీసుకెళ్లి వెంకట కృష్ణ గారి ఇంట్లో శ్రీరాంసార్ని కూడా పరిచయం చేశారు. నన్నూ, కల్లూరి భాస్కరంని శ్రీకాకుళంలో భూపాల్కు పరిచయం చేసింది కూడా ఆయనే.
ఆ తర్వాత కొంతకాలానికి వచ్చి కథా రచయితల మీటింగ్ ఏర్పాటు చేద్దామని అన్నారు. కథకులందరం కలుద్దాం. కాసేపు కథల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత కలిసి డిన్నర్ చేద్దామని చెప్పారు శ్రీపతి. నేనూ, ఆయన కలిసి నారాయణగూడ తాజ్మహల్కి వెళ్లి దాని యజమాని ప్రకాశ్రావుని కలిసి, విషయం చెప్పాం. అతను ఒప్పుకున్నారు. తాజ్మహల్ వాళ్లకు నామమాత్రంగా రూ. 500 ఇచ్చాం. అనుకున్న రోజు రానే వచ్చింది.
అది 1991 నవంబర్ 25. సాయంత్రం 6 గంటలకు తెలుగు సాహిత్యంలోని కథానిక విభాగంలో విశేష కృషి చేసిన కథా రచయితలంతా హోటల్లో కలుసుకున్నాం. తెలుగు కథ గురించి చర్చించాం. కో–ఆపరేటివ్ సంస్థను స్థాపించి కథా సంకలనాలు ప్రచురించాలని కొందరు ప్రతిపాదించారు. అందరం కలిసి మాట్లాడుకోవడం, డిన్నర్ చేయడం అద్భుతమని మరికొంతమంది అన్నారు. ఈ విధంగా కలవడం గురించి బాగా ఇంప్రెస్ అయ్యి మునిపల్లె రాజు తనపేరు, ఫోన్ నంబర్ రాసిన కాగితాన్ని నాకు ఇచ్చి వెళ్లారు. హోటల్, ఏర్పాట్లు మాత్రమే నేను చూశాను. ఒకరిద్దరు సన్నిహితులని (కథా రచయితలను) పిలిచాను. ఎక్కువ చొరవ తీసుకుని కథారచయితలను ఆహ్వానించింది మాత్రం శ్రీపతిగారే. ఈ కథకుల కలయిక, డిన్నర్ ప్రభావం చాలామంది మీద పడింది. వార్షిక కథా సంకలనాలు రావడం మొదలైంది. మేం చేసిన పనివల్ల చాలామంది ఏదో రకంగా ప్రభావితం కావడం సంతోషం కలిగించింది.
దేవరాజు మహారాజు, మునిపల్లె రాజు, బోయ జంగయ్య, ఇచ్చాపురపు జగన్నాథరావు, వేలుపిళ్లై సి. రామచంద్రరావు, తాడిగిరి పోతరాజు, తల్లావజ్జల శివాజీ, నందిగం కృష్ణారావు, భూపాల్, నిఖిలేశ్వర్, పోలీసు అధికారులైన కథారచయితలు రావులపాటి సీతారామారావు, సదాశివరావు, వాకాటి పాండురంగారావు లాంటివాళ్లు ఆ రోజు సమావేశానికి హాజరయ్యారు. మద్రాసు నుంచి శ్రీవిరించి కూడా వచ్చారు. కె.ఎన్.వై పతంజలి, ఎ. రాజారామ్మోహన్రావు, ఎ. సూర్యప్రకాశ్, మంజుశ్రీ, పోరంకి దక్షిణామూర్తి కూడా ఆరోజు సమావేశానికి హాజరయ్యారు.
మంజుశ్రీ, పోరంకి, దక్షిణామూర్తి గార్లు నాటి కథల గురించి, వాటి ఔన్నత్యం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. అప్పుడు వస్తున్న కథలు, విప్లవ స్ఫూర్తితో వచ్చిన కథల గురించి నిఖిలేశ్వర్ మాట్లాడారు. విమర్శకులు కవిత్వాన్ని పట్టించుకున్నంతగా కథల గురించి పట్టించుకోవడంలేదన్న చర్చ కూడా వచ్చింది. మనిషి ఎదుగుదలకి కథలు ఉపయోగపడతాయని, మంచి కథ ఎప్పుడూ చనిపోదని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. యువతరం కాంపిటేటివ్ పరీక్షల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, గతంలో కాలేజీలో చేరిన ప్రతిఒక్కరూ అంతో ఇంతో సాహిత్యం చదివేవారని, రాయడానికి ప్రయత్నించేవారిని జానకీరాణి, వేదుల శకుంతల అభిప్రాయపడ్డారు. నేటితరం, పాతతరం రచయితలను చూడడానికి ఆసక్తితో కీ.శే. బుచ్చిబాబు గారి సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి, దూరదర్శన్ న్యూస్ రీడర్ పార్వతీ ప్రసాద్ వచ్చారు.
జీవితంలో నుంచి వస్తున్న కథలకు, యువతరం అభిరుచులకు మధ్య చాలా దూరం ఉందని దాన్ని కొంతమంది సెక్సీ, క్రైమ్ కథలతో భర్తీ చేసి క్యాష్ చేసుకుంటున్నారని ఎలక్ట్రానిక్ మీడియా, నాన్ ఫిక్షన్ రచనలు, వార్తలు యువతరాన్ని కథలకు దూరం చేస్తున్నాయని దేవరాజు మహారాజు అన్నారు. గోదావరిఖని అచంపి ప్రచురణలు, కరీంనగర్ బుక్ట్రస్ట్ వారి ప్రచురణల గురించి, నల్ల కలువలు, భూమి వంటి కథా సంకలనాల గురించి నేను ప్రస్తావించాను.
కథా సంకలనాలు తెలుగు కథ, కథా భారతి, కళింగ కథానికలు తదితర కథా సంకలనాల గురించిన చర్చ కూడా అప్పుడు జరిగింది. అందులోని లోటుపాట్ల గురించి చాలామంది ప్రస్తావించారు. తెలుగు కథను హిందీ, ఇంగ్లిష్ భాషల్లోకి పంపించడానికి చేయాల్సిన తక్షణ కర్తవ్యాన్ని వాకాటి పాండురంగారావు నొక్కి చెప్పారు. ఏ గ్రూపులతో సంబంధం లేకుండా, సీనియర్లు, జూనియర్లు వ్యత్యాసం లేకుండా కథా రచయితలంతా ఒకచోట సమావేశం కావడం ఆనాటి విశిష్టత. రచయితలందరూ కలిసి డిన్నర్ తీసుకోవడం మరో ప్రత్యేకత. ఈ సమావేశంలో పాల్గొన్న ఇంకా కొందరు కథకుల పేర్లని నేను మర్చిపోవచ్చు. కానీ.. ఆ సమావేశాన్ని, ఆ డిన్నర్ని నాకు తెలిసి ఎవరూ మర్చిపోలేరు.
కలవడం ముఖ్యం. రచయితలు కలుసుకోవడం మరీ ముఖ్యం. ఇప్పుడు కూడా రచయితలు కలుస్తున్నారని వింటున్నాం. ప్రతివారం పత్రికల్లో వచ్చిన కథల్ని క్రమం తప్పకుండా ఓ గుచ్చంగా పంపిస్తున్న కె.ఎ. మునిసురేశ్ పిళ్లైని అభినందించకుండా ఉండలేము. తనకిష్టమైన కథల్ని క్రమం తప్పకుండా ప్రచురిస్తున్న వాసిరెడ్డి నవీన్ కృషిని కూడా గుర్తించక తప్పదు. ఖదీర్బాబు చేస్తున్న ప్రయత్నాలను పెద్దింటి అశోక్ క్లాస్లను, బీఎస్ రాములు చేస్తున్న కృషిని తెలుగునేల మరవదు.
ఏదేమైనా కథకులు అందరూ కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- డా. మంగారి రాజేందర్,
కవి, రచయిత
9440483001
