
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ (మం) తొగర్ పల్లిలో చెరువు పొంగిపొర్లుతుంది. వాగుకు అవతలి వైపు నివాసం ఉంటున్న దాదాపు 45 మంది వరదల్లో చిక్కుకున్నారు. వెంటనే మత్స్యకారులు నాటు పడవ సహాయంతో వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలిసిన తహశీల్దార్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాల వారు అలర్ట్ గా ఉండాలని సూచించారు.అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పారు.
భారీ వర్షాలు
మరో వైపు తెలంగాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో సెప్టెంబర్ 27న భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. 12 జిల్లాలలకు ఆరెంజ్ అలర్ట్, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆరెంజ్ అలర్ట్
ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఎల్లో అలర్ట్
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, జోగులాంబ గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.