నల్గొండ జిల్లాలో వాళ్ల మధ్య పవర్​ వార్​!

నల్గొండ జిల్లాలో వాళ్ల మధ్య పవర్​ వార్​!
  •     యాదాద్రి పవర్​ప్లాంట్​అక్రమాలపై నిలదీస్తున్న  బ్రదర్స్
  •     వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణ
  •     తాడోపేడో తేల్చుకుందాం రమ్మంటూ మాజీ మంత్రి​ సవాల్
  •     వ్యక్తిగత దూషణలతో రచ్చ రచ్చ

నల్గొండ, వెలుగు:  నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్​, మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి మధ్య ‘పవర్’​ వార్​మొదలైంది. పార్లమెంట్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరె డ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేరాజగోపాల్​ రెడ్డిలకు, బీఆర్​ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్​ రెడ్డికి నడుమ మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. రాజకీయ విమర్శలతో మొదలైన వివాదం వ్యక్తిగత దూషణల దాకా వెళ్లింది. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని, ఎంపీ ఎన్నికలయ్యాక సీఎం రేవంత్​రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమంటూ జగదీశ్​రెడ్డి చేసిన కామెంట్లతో ఈ రచ్చ మొదలైంది. మాజీ మంత్రి తనపై వచ్చిన ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికే సీఎంపై విమర్శలు చేస్తున్నారని బ్రదర్స్​కౌంటర్​ఇచ్చినా జగదీశ్​రెడ్డి వెనక్కి తగ్గలేదు. దీంతో యాదాద్రి థర్మల్​ పవర్​ప్లాంట్​లో జరిగిన పదివేల కోట్ల కుంభకోణంలో జగదీశ్​రెడ్డి పాత్ర కూడా ఉందని, త్వరలోనే ఆయన జైలుకెళ్లడం ఖాయమని బ్రదర్స్​ ఆరోపించడంతో ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. 

చర్చంతా యాదాద్రి థర్మల్​ప్లాంట్ అక్రమాల​చుట్టే.. 

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 2015లో నాటి సర్కారు యాదాద్రి థర్మల్​పవర్​ప్లాంట్​ నిర్మాణం చేపట్టింది. రూ.25వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో ప్రారంభించిన ఈ ప్లాంట్​నిర్మాణం 2021లో పూర్తి కావాలి. ఇది కంప్లీట్​అయితే 4 వేల మెగావా ట్ల విద్యుత్​జనరేట్​ అవుతుందని బీఆర్ఎస్​ ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ, తొమ్మిదేండ్లు గడుస్తున్నా ప్రాజెక్టు కంప్లీట్​కాకపోగా, అంచనా వ్యయం రూ.50 వేల కోట్లకు చేరింది. అంచనా వ్యయం డబుల్​కావడంతో అనుమానం వచ్చిన కాంగ్రెస్​ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

హైకోర్టు మాజీ న్యాయమూర్తి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన విచారణ తుది దశకు చేరింది. ఈలోపే ఎంపీ ఎన్నికల వేడి మొదలవడం, బ్రదర్స్​, సీఎం రేవంత్​లక్ష్యంగా జగదీశ్​రెడ్డి తీవ్ర ఆరోపణలు, తిట్ల పురాణం అందుకోవడంతో పవర్​ప్లాంట్​లో జరిగిన స్కాం గురించి కోమటిరెడ్డి బ్రదర్స్ ఓపెన్​అయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్​ను ముందరపెట్టి, తెర వెనుక కాంట్రాక్ట్​ పనులను నామినేషన్​ పద్ధతిలో అనుచరులకు అప్పగించారని, తద్వారా కేసీఆర్, జగదీశ్​రెడ్డి వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని బ్రదర్స్ ఆరోపిస్తున్నారు. దీనిపై జగదీశ్​​రెడ్డి గురువారం తీవ్రంగా స్పందించారు. 

వ్యక్తిగత దూషణలతో రాజకీయ దుమారం..

ఎవరు అవినీతికి పాల్పడ్డారో, ఎవరు, ఎన్ని కోట్లు అప్పనంగా సంపాదించారో, సొంత ఊళ్లకు పోయి చర్చిద్దామని  జగదీశ్​రెడ్డి గురువారం సవాల్​ విసిరారు. థర్మల్ పవర్​ప్లాంట్​ నిర్మాణం ప్రభుత్వం, జెన్​కో మధ్య జరిగిన ఒప్పందం అని, పనులు క్వాలిటీగా, నిజాయితీగా చేపట్టేందుకే బీహెచ్ఈఎల్​కు నాటి ప్రభుత్వం అప్పగించిందని జగదీశ్​ రెడ్డి అన్నారు. దీంట్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమైనని చాలెంజ్​ విసిరారు. ఇక్కడితో ఆగకుండా వాడు, వీడు, అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, పరిగెత్తించి కొడ్తాం , బట్టలు ఊడదీసి కొడ్తాం.. అంటూ హెచ్చరికలు చేసుకోవడం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఒక వైపు నామినేషన్ల హడావుడి మొదలు కాగా, మరోవైపు బ్రదర్స్, జగదీష్​ రెడ్డి మధ్య తీవ్రస్థాయికి చేరిన డైలాగ్​వార్​కాస్తా నల్గొండ జిల్లాలో ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని  దారి మళ్లించినట్లయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.