జ్వరంతో ఎన్నికల విధులకు.. సొమ్మసిల్లి పడిపోయిన ప్రిసైడింగ్ అధికారి

జ్వరంతో ఎన్నికల విధులకు..  సొమ్మసిల్లి పడిపోయిన ప్రిసైడింగ్ అధికారి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈవీఎంలు, ఎన్నికల మెటీరియల్ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. సిబ్బంది కూడా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రిసైడింగ్ అధికారి జ్వరంతో కళ్లు తిరిగి కింద పడిపోయాడు. 

సరూర్ నగర్ లోని జెడ్పీహెచ్ఎస్ లో బయో సైన్స్ పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు వెంకటేష్ .. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరంతోనే ఆయన ఎన్నికల విధులకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంగల్ పల్లిలోని సీవీఆర్ కళాశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు వెంకటేష్. 

వెంటనే ఆయన్ను 108 సిబ్బంది వైద్య సహాయం అందించారు. మెరుగైన వైద్యం కోసం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం సహకరించని కారణంగా వెంకటేష్ కి ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇచ్చారు ఉన్నతాధికారులు.