- కేయూలో విద్యార్థుల ఆందోళన
హసన్ పర్తి, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో జరిగిన పీహెచ్డీ అడ్మిషన్ల అక్రమాలకు సంబంధించిన రిపోర్ట్ ను బయట పెట్టాలని వర్సిటీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. పీహెచ్డీ అక్రమాలను నిగ్గు తేల్చడానికి త్రీ మెన్ కమిటీని నియమించగా, ఇటీవల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ రిపోర్ట్వర్సిటీ ఆఫీసర్లకు అందిందన్న సమాచారంతో పీహెచ్డీ అభ్యర్థులు బుధవారం సాయంత్రం రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఛాంబర్ కి వెళ్లి నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
రిజిస్ట్రార్ మాట దాటవేసే యత్నం చేస్తున్నారంటూ ఘెరావ్ చేశారు. వాదనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న కేయూ పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పీహెచ్ డీ అక్రమాల చిట్టా బయట పెట్టేంత వరకు ఉద్యమిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. దీనిపై గురువారం నుంచి వరుస ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.