అపార్ట్​మెంట్​ పైనుంచి పడి విద్యార్థి​ మృతి

అపార్ట్​మెంట్​ పైనుంచి పడి విద్యార్థి​ మృతి
  • నోయిడాలో దారుణం

నోయిడా: ఉత్తరప్రదేశ్​లోని నోయిడాలో మరో విషాదం చోటుచేసుకుంది. సిటీలోని ఓ హౌసింగ్ సొసైటీలో ఎనిమిదో అంతస్తు పైనుంచి పడి స్టూడెంట్​మృతి చెందాడు. సెక్టార్ 100లోని లోటస్ బౌలేవార్డ్ సొసైటీలో శుక్రవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఆ స్టూడెంట్​ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడిపోయాడా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది  తెలియాల్సి ఉందని నోయిడా ఏసీపీ రజనీష్ వర్మ తెలిపారు. బిల్డింగ్​లోని పైఅంతస్తు నుంచి పదో నెంబర్​టవర్ ఫస్ట్​ ఫ్లోర్​ బాల్కనీలో ఓ వ్యక్తి పడిపోయాడని, తీవ్ర గాయాలయ్యాయని సొసైటీ సెక్యూరిటీ గార్డు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడని వర్మ చెప్పారు. పోలీసు టీమ్ వెంటనే స్పాట్​కు చేరుకుని ఆ వ్యక్తిని డిస్ట్రిక్ట్ ​హాస్పిటల్​కు తీసుకువెళ్లిందని తెలిపారు.

అక్కడ వైద్యులు పరీక్షించి అతను అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారని చెప్పారు. మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించామని, చనిపోయిన స్టూడెంట్ ను​మధుర జిల్లాకు చెందిన గంటవ్య శర్మ(21)గా గుర్తించినట్లు ఏసీపీ తెలిపారు. మధురలోని కాలేజీలో శర్మ చదువుతున్నాడని, లోటస్ బౌలేవార్డ్ సొసైటీలోని 8వ అంతస్తులో ఉంటున్న తన బంధువుల వద్దకు శుక్రవారం వచ్చాడని స్థానిక పోలీసులు చెప్పారు. వారితో మాట్లాడి, ఫ్లాట్ నుంచి బయటకు వచ్చాక ఈ ప్రమాదం జరిగిందన్నారు. కాగా, శుక్రవారం తెల్లవారుజామున ఐదేళ్ల పిల్లాడు కూడా ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడి మరణించిన విషయం తెలిసిందే!