
మహబూబాబాద్: స్కూల్లో సారు కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిండు ఓ మూడో తరగతి విద్యార్థి. కొంతకాలంగా మ్యాథ్స్ టీచర్ తనను విపరీతంగా కొడుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అనిల్ నాయక్ అనే విద్యార్థి మూడో తరగతి చదువుతున్నాడు. సరిగ్గా చదవడంలేదంటూ మ్యాథ్స్ టీచర్ అనిల్ ను విపరీతంగా కొడుతున్నాడు. గతంలో కూడా ఇలాగే జరిగితే.. అనిల్ తల్లిదండ్రులు ఆ టీచర్ ను కొట్టవద్దని బతిమాలారు. అయినా తీరుమార్చుకోని టీచర్ బాలున్ని నిత్యం కొడుతూనే ఉన్నాడు. దీంతో టీచర్ దెబ్బలు భరించలేక ఆ విద్యార్థి.. తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమాదేవి తెలిపారు.