- ఉత్తరాఖండ్లోని కాలాగఢ్ టైగర్ రిజర్వ్ సరిహద్దు గ్రామాల్లో కలకలం
- మూడు రోజుల్లో పులి దాడిలో ఇద్దరి మృతి
- రాత్రి కర్ఫ్యూ.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన గ్రామపెద్దలు
డెహ్రాడూన్: ‘‘వామ్మో.. పులి” అంటూ ఆ ఊళ్లు వణికిపోతున్నాయి. ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టేందుకూ గ్రామస్తులు జంకుతున్నారు. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు స్థానికులు పులి పంజాకు చిక్కి మరణించడంతో.. ఏ క్షణాన ఎవరిపై మళ్లీ పులులు దాడి చేస్తాయోననే భయంతో వణుకుతున్నారు. ఈ పరిస్థితి ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లా కాలాగఢ్ టైగర్ రిజర్వ్ను ఆనుకొని ఉన్నరిఖ్నిఖాల్, నైనిదాంద, సిమ్లి సహా 25 గ్రామాలలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాల పెద్దలు సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఊర్లలోకి రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తామని ప్రకటించారు.
స్థానికంగా స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చారు. ఇక పులి దాడి చేసిన ఘటనల విషయానికి వస్తే.. ఏప్రిల్ 13న రిఖ్నిఖాల్గ్రామానికి చెందిన 73 ఏళ్ల రైతు బీరేంద్ర సింగ్ తన భార్యతో కలిసి పొలం పనుల్లో ఉండగా, అతడిపై పులి దాడి చేసింది. భార్య అరుస్తున్నా.. బీరేంద్రను పులి లాక్కొని వెళ్లింది. కొన్ని గంటల తర్వాత సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో బీరేంద్ర సింగ్ మృతదేహాన్ని దారుణమైన స్థితిలో స్థానికులు గుర్తించారు. ఇక ఏప్రిల్15న సిమ్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ రణ్వీర్ సింగ్(75) పై పులి దాడి చేసింది. పులి సగం తినేసిన రణ్వీర్సింగ్ డెడ్బాడీని.. మృతుడి ఇంటికి సమీపంలోనే స్థానికులు గుర్తించారు.
మరోవైపు ఈ పులులను బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. చనిపోయిన ఇద్దరు వ్యక్తుల డీఎన్ఏ శాంపిళ్లను బెంగళూరులోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ ల్యాబ్స్కు పంపామని, ఇద్దరిపై ఒకే పులి దాడి చేసిందా? వేర్వేరు పులులు దాడి చేశాయా? అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని ఆఫీసర్లు తెలిపారు.