లడఖ్‌లో ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. తొమ్మిది మంది సైనికులు మృతి

లడఖ్‌లో ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. తొమ్మిది మంది సైనికులు మృతి

లడఖ్‌ : లడఖ్‌లోని ఖేరి సమీపంలో శనివారం (ఆగస్టు 19న) ఘోర ప్రమాదం జరిగింది. భారత జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సైనికులు వీర మరణం పొందారని అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ (జేసీవో), ఎనిమిది మంది జవాన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. లేహ్‌ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని ఖేరీ ప్రాంతం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో సైనిక వాహనంలో 10 మంది ప్రయాణిస్తున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం (ఆగస్టు 19వ తేదీ)  సాయంత్రం 4 గంటల 45 నిమిషాల సమయంలో లేహ్‌ నుంచి నైమా వైపు వెళ్తుండగా వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగిందని లేహ్‌ సీనియర్‌ ఎస్పీ పి.డి. నిత్యా వెల్లడించారు. సమాచారం తెలియగానే పోలీసు బృందం ఘటనా స్థలానికి వెళ్లిందన్నారు. గాయపడిన సైనికులను ఆర్మీ ఆస్పత్రికి తరలించినట్టు  వివరించారు. గాయాలతో చికిత్స పొందుతున్న ఒక జవాన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

ప్రమాదంపై రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. వీర మరణం చెందిన భారత సైనికులను దేశం ఎప్పటికీ మరిచిపోదని ట్విట్టర్ లో వెల్లడించారు.