కొరియర్ పేరితో ఓ వ్యాపారికి 29 లక్షల రూపాయలు టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారికి ఫిడేక్స్ కొరియర్ నుంచి ఫోన్ చేస్తున్నామని తన పేరుపై నిషేధిత ప్రొడక్ట్ తైవాన్ నుంచి బుక్ అయినట్టు నమ్మబలికారు.
ఈ విషయాన్ని కస్టమ్స్ అధికారులకు చెప్పామని వ్యాపారికి తెలిపారు. వెంటనే కస్టమ్స్ అధికారుల పేరుతో వ్యాపారికి మరో ఫోన్ కాల్ చేసి నిషేధిత ప్రొడక్ట్ వేరే దేశాలకు పంపించడం నేరమని కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.
కేసు లేకుండా ఉండాలంటే రూ.29 లక్షలు చెల్లించాలని బెదిరించారు. వారి ఫోన్ కాల్స్ నమ్మిన బాధితుడు కేసు నమోదు అవుతుందన్న భయంతో సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్ కు రూ.29లక్షలు పంపించాడు.
సైబర్ కేటుగాళ్లు అంతటితో ఆగకుండా మరికొంత డబ్బు పంపించాలని ఒత్తిడి చేయడంతో... బాధిత వ్యాపారి సెప్టెంబర్ 4న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి తెలిపారు.