- మహిళ నుంచి రూ. 44 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
బషీర్బాగ్, వెలుగు : యూట్యూబ్ వీడియోలపై ఇన్వెస్ట్ పేరుతో మహిళ నుంచి సైబర్ నేరగాళ్లు భారీగా డబ్బు కాజేశారు. సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సిటీకి చెందిన ఓ మహిళకు టెలిగ్రామ్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను యూట్యూబ్లో ఇన్వెస్ట్ మెంట్ బిజినెస్ చేస్తానని నమ్మించాడు. ఆమెకు ఓ లింక్ను పంపించి రేటింగ్ ఇవ్వాలని కోరాడు. లింక్ను ఓపెన్ చేసిన మహిళ రేటింగ్ ఇచ్చింది. యూట్యూబ్లో వీడియోలపై ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని సదరు వ్యక్తి ఆమెకు చెప్పాడు.
అతడి మాటలు నమ్మిన మహిళ మొదట రూ.11 వేలు ఇన్వెస్ట్ చేసింది. ఆ వ్యక్తి ఆమెకు లాభాలు పంపించాడు. దీంతో అతడి ట్రాప్లో పడిపోయిన ఆమె పలు దఫాలుగా రూ.44 లక్షలు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత నుంచి లాభాలు ఇవ్వకపోగా.. ఇంకా ఇన్వెస్ట్ చేయాలంటూ ఆ వ్యక్తి ఒత్తిడి చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.