
అశ్వారావుపేట, వెలుగు: ఓ వ్యక్తిని స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తుండగా, అతని కొడుకు వెళ్లి డ్యూటీ కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడిన ఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు తెలిపిన ప్రకారం.. అశ్వరావుపేట మండలం నల్లపాడుకు చెందిన గడ్డం వెంకటస్వామి, గడ్డం వసంతరావు మధ్య గురువారం పొలం వద్ద విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ విషయమై గొడవ జరిగింది.
దీంతో శుక్రవారం వసంతరావు పోలీసులకు కంప్లయింట్ చేయగా, విచారణ కోసం వెంకటస్వామిని స్టేషన్ కు తీసుకెళ్లారు. అతని కొడుకు వెంకన్న బాబు వెళ్లి ‘ మా నాన్నను స్టేషన్ కు పిలిపించి దురుసుగా ప్రవర్తిస్తారా? ’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు కృష్ణమూర్తి, లక్ష్మీపతి, కానిస్టేబుల్ సంతోష్ పై దాడి చేశాడు. అతడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.