కొత్తూరులో మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు నలుగురి అరెస్ట్
శంషాబాద్, వెలుగు: తను ప్రేమించిన యువతిని మరో యువకుడు లవ్ చేయగా అతడిని కిరాతకంగా హత్య చేసిన ఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు గురువారం మీడియాకు వివరాలు తెలిపారు. హెచ్ఐఎల్ కంపెనీ ఎంప్లాయ్ రాజ్ కపిల్ సాహు(20) ఈనెల 18న ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైనట్టు సహోద్యోగి సోమేశ్ కుమార్ కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజ్ కపిల్ సాహుతో కలిసి ఉంటున్న సోనిల్ చౌదరిని పోలీసులు విచారించగా.. రాహుల్ సింగ్ అలియాస్ అమర్నాథ్ను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పాడని తెలిపాడు. అయితే.. రాహుల్ సింగ్ ప్రేమిస్తున్న యువతిని రాజ్ కపిల్ సాహు కూడా లవ్ చేస్తున్నాడు. దీంతో అతడిని చంపితేనే ప్రియురాలు తనకు దక్కుతుందని రాహుల్ సింగ్ భావించి తన ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ వేశాడు. ఈ నెల18న రాజ్ కపిల్ సాహుతో మాట్లాడాలని తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ రోడ్ లోని జనసాయి వెంచర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మందు తాగారు. అనంతరం రాజ్ కపిల్ సాహును పొడిచి గ్రానైట్ రాళ్లతో తలపై కొట్టి తన ఫ్రెండ్స్ తో కలిసి రాహుల్ సింగ్ హత్య చేశారు. డెడ్ బాడీ కనిపించకుండా పొదల్లో వేసి పైనుంచి మట్టి పోసి పరారయ్యారు.
ఈ నెల 19న తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకోగా రాహుల్ సింగ్, అతని స్నేహితుడు మహమ్మద్ తాహిర్, మరో ఇద్దరి యువకులు నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులైన నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.