గాంధీనగర్: గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గాధ్వి ఓటమి పాలయ్యారు. ఖంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి అయర్ ములుభాయ్ హర్దాస్భాయ్ బేరా చేతిలో 18,745 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో బేరాకు మొత్తం 77,834(40.96%) ఓట్లు పోలవగా..గాధ్వికి 59089(31.1%) ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి అహిర్ విక్రమ్భాయ్ అర్జన్భాయ్ 44,715(23.53%) ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈ మూడు పార్టీల తర్వాతి స్థానంలో నోటా(2,582 ఓట్లు) నిలిచింది. 2021 జూన్లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఇటీవల ఇసుదన్ గాధ్విని ఆప్ తరఫున గుజరాత్ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ ప్రకటించారు.
వడ్గాంలో మరోసారి జిగ్నేశ్ మేవాని గెలుపు
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైనప్పటికీ ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్జిగ్నేశ్ మేవానీ మాత్రం తన సీటును కాపాడుకున్నారు. తన వడ్గాం కానిస్టెన్సీ నుంచి రెండోసారి గెలిచారు. ఈ సందర్భంగా మేవానీ.. ‘వడ్గాం ప్రజలకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ గెలుపు నా కానిస్టెన్సీ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని తెలుపుతుంది. ఇది సొసైటీలో పేద, అట్టడుగు వర్గాలను మరింత ముందుకు తీసుకొచ్చే బాధ్యతను కూడా నాపై ఉంచింది.’ అని ట్వీట్ చేశారు. మేవానీ గుజరాత్ రాష్ట్రంలోని దళిత ప్రముఖులలో ఒకరు. దళిత హక్కుల కోసం పోరాడే రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ కన్వీనర్. ఆయన 2017 గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్లో వడ్గాం కానిస్టెన్సీ నుంచి ఇండిపెండెంట్గా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ఆ కానిస్టెన్సీలో తమ పార్టీ తరఫున క్యాండిడేట్ను పెట్టకుండా మేవానీకి మద్దతు తెలిపింది.
జడేజా భార్య రివాబా ఘన విజయం
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఘనవిజయం సాధించారు. ఇంతకు ముందు ఏమాత్రం రాజకీయ అనుభం లేని ఆమె .. తొలిసారి జామ్ నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 57 శాతానికి పైగా ఓట్లు సాధించి భారీ మెజారిటీతో విజయం అందుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కర్షన్భాయ్ కర్మూర్ 23 శాతం ఓట్లతో రెండవ స్థానంలో.. కాంగ్రెస్ అభ్యర్థి బిపేంద్రసింగ్ చతుర్ సిన్హ్ జడేజా 15.5 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. రివాబాకు మొత్తం 84,336 ఓట్లు రాగా, ఆప్ అభ్యర్థికి 33,880 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ కేవలం 22,822 ఓట్లు మాత్రమే సాధించింది. 50 వేలకు పైగా మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందడంపై రివాబా మాట్లాడుతూ.. ఇది కేవలం తన విజయం మాత్రమే కాదని..ప్రజా విజయమని పేర్కొన్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలిపారు. అనంతరం రివాబా తన భర్త జడేజాతో కలిసి జామ్ నగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు.