బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటిన అమీర్ ఖాన్

బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటిన అమీర్ ఖాన్
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన అమీర్ ఖాన్ 
  • అమీర్ ఖాన్ తో కలసి మొక్కలు నాటిన నాగచైతన్య, ఎంపీ సంతోష్ కుమార్ 

హైదరాబాద్: కోట్ల హృదయాలను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. ప్రతి రోజు భూమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఇవ్వాల బాలీవుడ్ సూపర్ స్టార్, విలక్షణ చిత్రాల హీరో అమీర్ ఖాన్ ను చేరింది. ఆదివారం హైదరాబాద్ వచ్చిన మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, తన లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చద్ధా’లో సహనటుడు, టాలీవుడ్ యంగ్ టర్క్ అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజ్ లను మనం చూసాం కానీ, మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్ ను మనకు అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మనందరం తప్పనిసరిగా మొక్కలు నాటాలి, వాటిని బాధ్యతగా పెంచాలి, అప్పుడే మన భవిష్యత్ తరాలకు మనం జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లం అవుతామని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.