
జలంధర్ బై పోల్లో ఆప్ ఘన విజయం
58,647 ఓట్ల తేడాతో సుశీల్ రింకూ విక్టరీ
చండీగఢ్ : పంజాబ్ లోని జలంధర్ లోక్ సభ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థి సుశీల్ రింకూ ఘన విజయం సాధించారు. 58,647 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు. దివంగత కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌధరి మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఆప్ నుంచి రింకూ బరిలోగా దిగగా.. కాంగ్రెస్ నుంచి సంతోఖ్ భార్య కరమ్ జిత్ కౌర్ పోటీ చేశారు. శిరోమణి అకాలీ దళ్ మాజీ నేత ఇందర్ ఇక్బాల్ అత్వాల్ను బీజేపీ బరిలోకి దింపింది. రింకూకు 3,02,279 ఓట్లు పోలవగా, ఆయన సమీప ప్రత్యర్థి కరమ్ జిత్ కు 2,43,588 ఓట్లు వచ్చాయి.
యూపీలోని అప్నాదళ్ (ఎస్) విజయం
ఉత్తరప్రదేశ్ లోని సువర్, చాన్బే అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ (సోనేలాల్) అభ్యర్థులు గెలుపొందారు. చాన్బేలో ఆ పార్టీ మరో అభ్యర్థి రింకీ కోల్ విజయం సాధించారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ వారికి అభినందనలు తెలిపారు. అలాగే స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను కూడా ఆయన అభినందించారు. ఇక ఒడిశాలోని ఝార్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన బై పోల్ లో బిజూ జనతా దళ్(బీజేడీ) అభ్యర్థి దీపాలీ దాస్ 48,000 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.సిట్టింగ్ ఎమ్మెల్యే, దివంగత మంత్రి నబా కిశోర్ దాస్ ఈ ఏడాది జనవరి 29న హత్యకు గురయ్యారు. మేఘాలయలోని సోహివోంగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి సిన్షార్ కుపార్ రాయ్ గెలిచారు.