న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్పై కన్నేసింది. ఢిల్లీ, పంజాబ్ తర్వాత ప్రస్తుతం గుజరాత్ ఆప్ను కోరుకుంటోందని ఆ పార్టీ ట్వీట్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గుజరాత్లో తిరంగా యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా మిషన్ గుజరాత్కు ఆప్ శ్రీకారం చుట్టనుంది. గుజరాత్లోని అన్ని జిల్లాలు, గ్రామ పంచాయితీలను చుట్టి వచ్చేలా ఈ యాత్ర ప్లాన్ చేశారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఈ యాత్రలో పాల్గొననున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలతో జోరు మీదున్న బీజేపీకి గట్టి పోటీ ఇస్తామని ఆప్ సీనియర్ నేతలు అంటున్నారు. డిసెంబర్ లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తొలిసారి బరిలోకి దిగనుంది. తొలి ప్రయత్నంలో చేపట్టలేకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా అయినా మారుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్లో బీజేపీకి ప్రధాన పోటీగా ఆప్ నిలిచేలా రానున్న 9 నెలల్లో కృషి చేస్తామని అంటున్నారు.