
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం (జూన్ 1) క్వాలిఫయర్ 2 లో ముంబైపై పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కొట్టిన ఒక షాట్ వైరల్ గా మారుతుంది. 204 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ లక్ష్యం దిశగా పయనిస్తోంది. పంజాబ్ గెలవాలంటే 3 ఓవర్లలో 31 పరుగులు చేయాలి. ఈ దశలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య 18 ఓవర్ వేయడానికి బుమ్రా వచ్చాడు. ఈ ఓవర్ రెండో బంతికి బుమ్రా 140 కి.మీ వేగంతో యార్కర్ విసిరాడు. బంతి మిడిల్ స్టంప్ పై దూసుకెళ్తుంది. ఈ బంతిని అయ్యర్ పర్ఫెక్ట్ టైమింగ్ తో చాలా ఈజీగా కట్ ఇచ్చి ఫోర్ కొట్టాడు. తీవ్ర ఒత్తిడిలో శ్రేయాస్ కొట్టిన ఈ అద్భుతమైన షాట్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అయితే అయ్యర్ షాట్ కు ఫిదా అయ్యాడు. బుమ్రా వేసిన యార్కర్ లో అయ్యర్ కొట్టిన షాట్ తనకు ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చాడు. "ఐపీఎల్లో అయ్యర్ కొట్టిన షాట్ ఈ సీజన్ లో నాకు బెస్ట్ షాట్. బుమ్రా వేసిన పర్ఫెక్ట్ యార్కర్ మిడిల్-స్టంప్ మీదుగా వెళ్తుంది. ఈ బంతి నుంచి తప్పించుకోవడం కష్టం. నేను గనుక ఆ బంతిని ఎదుర్కొని ఉంటే బహుశా నా స్టంప్స్ ఎగిరి పడేవి. అయ్యర్ ఆ బంతిని ఫోర్ కొట్టి ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్పై ఒత్తిడి తీసుకొని వచ్చాడు". అని ఏబీ డివిలియర్స్ జియోసినిమాతో అన్నాడు.
టార్గెట్ ఛేజింగ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (41 బాల్స్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 87 నాటౌట్) దుమ్మురేపడంతో.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేహల్ వదేరా (29 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48) కూడా అండగా నిలవడంతో.. ఆదివారం జరిగిన క్వాలిఫయర్–2లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్కు చెక్ పెట్టింది. టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 203/6 స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో 207/5 స్కోరు చేసి గెలిచింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.