
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీపై అనర్హత వేటు పడింది. హేట్ స్పీచ్ కేసులో స్థానిక కోర్టు ఆయనకు రెండేండ్ల జైలు శిక్ష విధించడంతో ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేసినట్టు అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి.
ఇప్పుడు మౌ సదర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్టు పేర్కొన్నాయి. ఒకప్పటి గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ కొడుకు అయిన అబ్బాస్ అన్సారీ.. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఆయన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ తరఫున మౌ సదర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ సభలో అబ్బాస్ అన్సారీ మాట్లాడుతూ.. ‘‘మేం అధికారంలోకి వచ్చాక అధికారుల సంగతిచూస్తాం. గుణపాఠం చెబుతాం” అని బెదిరించారు. దీంతో ఆయనపై కేసు నమోదు కాగా.. విచారణజరిపి కోర్టు ఆయనకు రెండేళ్లు శిక్ష విధించింది. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అబ్బాస్ అన్సారీ పదవి కోల్పోయారు.