న్యూఢిల్లీ:కరెంటు పొదుపును సూచించే ఎనర్జీ లేబులింగ్కు సంబంధించి కొత్త రూల్స్ను వచ్చే నెల నుంచి అమలు చేస్తారు. దీనివల్ల కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రూల్స్ ప్రకారం ఫైవ్ స్టార్ రేటింగ్ గల ఫ్రిజ్ల ధరలు రూ.ఆరు వేల దాకా పెరుగుతాయని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) తెలిపింది. ఇక నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్ ఫ్రిజ్లలో కూలింగ్ కోసం ఫోమ్స్కు బదులు వాక్యూమ్ ప్యానెల్స్ వాడాలి.
ఈ మార్పు కంపెనీలకు సవాలేనని అసోసియేషన్ పేర్కొంది. కంప్రెసర్ ఆధారంగా పనిచేసే రూమ్ ఏసీలకు, ఫ్రిజ్లకు లేబులింగ్ నిబంధనలను మార్చుతున్నట్టు బ్యూరో ఆఫ్ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) ప్రకటించింది. ఈ విషయమై సీఈఏఎంఏ ప్రెసిడెంట్ కమల్ నంది మాట్లాడుతూ హఠాత్తుగా ఫ్రిజ్ ధరను రూ.ఆరు వేలు పెంచితే ఎవరు కొంటారని ప్రశ్నించారు. ఫోమ్కు బదులు వాక్యూమ్ ప్యానెల్స్ తయారీ కోసం కంపెనీలు మరింత ఇన్వెస్ట్మెంట్ కావాలని అన్నారు. అయితే ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు పుంజుకుంటున్నాయని, ఏసీలు, వాషింగ్ మెషీన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని ఆయన వివరించారు.