ఏసీపీ అవినీతి కేసు: ప్రభుత్వ భూమిని భార్య పేరిట రిజిస్ట్రేషన్‌

ఏసీపీ అవినీతి కేసు: ప్రభుత్వ భూమిని భార్య పేరిట రిజిస్ట్రేషన్‌

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు సోమ‌వారం కస్టడీలోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు అనుమతితో నాలుగు రోజుల పాటు విచార‌ణ నిమిత్తం సోమ‌వారం ఉద‌యం నర్సింహారెడ్డిని నాంపల్లిలోని ఏసీబీ ఆఫీసుకు తరలించారు.

ఈ కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించిన ఏసీబీ.. ఇందులో 11 మందిని అరెస్ట్ చేసింది. మిగ‌తా ఇద్దరు నిందితులు ప‌రారీలో ఉన్నారు. నిందితుల్లో A-1 నర్సింహారెడ్డి, A-2 గోపగాని రాజలింగం, A-3 గోపగాని సజ్జన్ గౌడ్, A-4 పోరేటి వెంకట్ రెడ్డి, A-5 పోరేటి తిరుపతి రెడ్డి,A-6 ఎర్ర శంకరయ్య, A-7 ఎర్ర చంద్రశేఖర్, A-8 అర్జుల గాలి రెడ్డి, A-9 అర్జుల జైపాల్,A-10 మదుకర్ శ్రీరామ్,A-11 చంద్రా రెడ్డి,A-12 బత్తిని రమేష్,A-13 అలుగు వెళ్లి శ్రీనాస్ రెడ్డి లుగా ఉన్నారు.

ఏసీపీ నర్సింహారెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించిన‌ ఏసీబీ అధికారులు..  A-2 నుండి A -13 వరకు ఉద్దేశ్య పూర్వకంగానే నర్సింహారెడ్డి కి ఈ కేసులో సహకరించారని తేల్చారు. హైటెక్ సిటీ సర్వే నెంబర్ 64 లోని 60 కోట్ల రూపాయల విలువైన 2 వేల గ‌జాల‌ ప్రభుత్వ భూమిని నిందితులు కబ్జా చేసినట్టు తెలిపారు.

2 వేల గజాల‌ భూమిని 490 గజాలు చొప్పున నాలుగు భాగాలుగా విభజించి 4 డాక్యుమెంట్లు సృష్టించి, మొదట తండ్రుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన నిందితులు ఆ తరువాత కొడుకుల పేరిట గిఫ్ట్ డీడ్ గా మార్చారు. గిఫ్ట్ డీడ్ నుంచి నర్సింహారెడ్డి భార్య పేరుతో పాటు మరో నలుగురు బినామీల పేరిట ఏసీపీ నర్సింహారెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

ఆ భూమి ప్ర‌భుత్వ భూమి అని, నిందితులకు భూమి పై ఎలాంటి హక్కు లేకున్నా ప్రయివేటు భూమిగా మార్చార‌ని రెవిన్యూ అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారులు వీటితో పాటు నర్సింహారెడ్డి బినామి ఆస్తులను భారీగా గుర్తించారు. హైదరాబాద్ లో నాలుగు నివాస గృహాలు, అనంతపురం లో 55 ఎకరాల వ్యవసాయ భూమి ని గుర్తించారు.