శ్రీధర్ లాకర్లలో 25 కోట్ల జువెలరీ, క్యాష్.. కాళేశ్వరం ఈఈ‌‌‌‌ లాకర్లు ఓపెన్ చేయించిన ఏసీబీ

శ్రీధర్ లాకర్లలో 25 కోట్ల జువెలరీ, క్యాష్.. కాళేశ్వరం ఈఈ‌‌‌‌ లాకర్లు ఓపెన్ చేయించిన ఏసీబీ
  • నేటితో ముగియనున్న నిందితుడి 5 రోజుల కస్టడీ
  • కోర్టు అనుమతితో బినామీ ఆస్తులు అటాచ్ !

హైదరాబాద్‌‌‌‌‌‌‌, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్‌‌‌‌ ఈఈ నూనె శ్రీధర్‌‌‌‌‌‌‌‌ అక్రమాస్తుల చిట్టా బయటపడుతోంది. కోర్టు అనుమతితో శ్రీధర్‌‌‌‌‌‌‌‌ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నాలుగో రోజు కస్టడీలో భాగంగా నిందితుడిని అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. బ్యాంకు లాకర్లు తెరిపించారు. లాకర్లలో రూ.25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, పలు కీలక ఆస్తుల పత్రాలు గుర్తించినట్లు తెలిసింది. మంగళవారంతో శ్రీధర్  కస్టడీ ముగియనుంది. ఐదు రోజుల కస్టడీ విచారణలో ఆయన నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా అక్రమాస్తుల లెక్కలు తేల్చనున్నారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో కస్టడీ రిపోర్ట్‌‌‌‌  దాఖలు చేయనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులు పర్యవేక్షించిన సమయంలోనే శ్రీధర్‌‌‌‌  ఇంత భారీ మొత్తంలో అక్రమార్జనకు పాల్పడినట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. గత నాలుగు రోజుల దర్యాప్తులో భాగంగా ఆయనకు బినామీలుగా వ్యవహరించిన వారి వివరాలు కూడా సేకరించారు. అలాగే, సోదాల సమయంలో శ్రీధర్  ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఈ క్రమంలో కోర్టు అనుమతి తీసుకుని బినామీ ఆస్తులను అటాచ్  చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.