ఆ హైవే జర్నీ డేంజర్..రెండు నెలల్లో 18 మంది మృత్యు ఒడికి

ఆ హైవే జర్నీ డేంజర్..రెండు నెలల్లో 18 మంది మృత్యు ఒడికి
  • నాందేడ్ -అకోలా హైవే పై తరచూ ఘోర ప్రమాదాలు            

మెదక్​, సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి, మెదక్ జిల్లా మీదుగా ఉన్న నాందేడ్- అకోలా నేషనల్ హైవే నెంబర్ 161 ప్రయాణికులకు దడ పుట్టిస్తోంది. కొత్తగా ఫోర్ లైన్ హైవే నిర్మాణం పూర్తయిన తర్వాత తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్ తో పాటు, కొన్ని గ్రామాల దగ్గర ఎగ్జిట్లు లేక పోవడం, వెహికల్స్​ రాంగ్ రూట్ లో వెళ్తుండడం, టోల్ గేట్ ఎత్తేశాక రోడ్డు మధ్యలోనున్న సిమెంట్ డివైడర్లు తొలగించక పోవడం ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగి ఆరుగురు చనిపోయారు. రెండు నెలల్లో సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో 18  మంది మృత్యు ఒడికి చేరారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

కారణాలేవంటే..

నాందేడ్ అకోలా హైవే ఫోర్​లైన్​రోడ్డుగా డెవలప్​చేశాక వెహికల్స్​చాలా స్పీడ్​గా వెళ్తున్నాయి. ఓవర్​స్పీడ్​, ఓవర్​టేక్​చేస్తున్న క్రమంలో అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి.  బ్రిడ్జిలు, గ్రామాలకు వెళ్లే రూట్లు ఉన్నచోట సరైన సూచిక బోర్డులు లేక పోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. మెదక్ జిల్లా పరిధిలో కొన్ని గ్రామాల దగ్గర ఎగ్జిట్​లు లేకపోవడం వల్ల దూరం నుంచి తిరిగి రావాల్సి వస్తోందని వాహనదారులు రాంగ్ రూట్ లో వెళ్తుండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

అల్లాదుర్గం నుంచి గడి పెద్దాపూర్​ మధ్యలో హైవే పక్కన బెల్ట్​షాప్ ఉంది. పరిసర గ్రామాల నుంచి మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్తున్న వాహనదారులు హైవే మీద రాంగ్​రూట్​లో ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్ద శంకరంపేట మండలం కోళ్లపల్లి వద్ద టోల్ గేట్ ఎత్తేశాక అక్కడ రోడ్డు మధ్యలో ఉన్నసిమెంట్ డివైడర్లు తొలగించక పోవడం ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. రాత్రి వేళ హైవే మీద స్పీడ్​గా వస్తున్న వెహికల్స్​డివైడర్లను గుర్తించక వాటిని ఢీకొట్టి ప్రమాదాకలకు గురవుతున్నారు. 

ప్రమాదాలు ఇలా..

సంగారెడ్డి జిల్లా పరిధిలో 161వ నేషనల్ హైవే మీద గడిచిన రెండు నెలల్లో ఐదు ప్రమాదాలు జరిగి ఏడుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. మూడు రోజుల క్రితం ఇదే హైవేపై సంగుపేట వద్ద బైకు కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు క్షతగాత్రులయ్యారు. తాజాగా సోమవారం అర్ధరాత్రి ఆందోల్​ మండల పరిధి మాసానిపల్లి బ్రిడ్జి కింద రోడ్డు పక్కన కారు ఆపి మూత్ర విసర్జన చేస్తున్న వారిని టిప్పర్​లారీ ఢీ కొట్టగా జోగిపేటకు చెందిన వాజీద్ (28), హాజీ (28), ఉక్రాన్ (29) అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురు యువకులు గాయపడ్డారు. మెదక్ జిల్లా పరిధిలో టేక్మాల్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట మండలాల పరిధిలో నేషనల్​హైవే మీద గడిచిన 2 నెలల్లో 11 ప్రమాదాలు జరిగి 9 మంది మృతి చెందారు.

ఈ నెల 20వ తేదీన అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ వద్ద బైక్ ను కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు. పెద్ద శంకరంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు గడి పెద్దాపూర్ ఫ్లైఓవర్ పై రాంగ్ రూట్​లో వస్తున్న బైకును ఢీకొంది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న పాపన్నపేట్ మండలం బాచారం గ్రామానికి చెందిన గడ్డం ప్రభాకర్ (29), భీమయ్య (28), శ్రీకాంత్ (25) స్పాట్ లోనే చనిపోయారు.  మాస్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. 26వ తేదీ రాత్రి అల్లాదుర్గం మండలం కాయిదం పల్లి వద్ద ఆయిల్​ట్యాంకర్​బోల్తా పడి డ్రైవర్​ కియారాం (24) స్పాట్​లోనే చనిపోయాడు. 

నివారణ చర్యలు చేపట్టాలి

నేషనల్​హైవే అథారిటీ అధికారులు, పోలీసులు జాయింట్​గా సర్వే చేసి నేషనల్​హైవే మీద ఎక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయంపై అధ్యయనం చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అవసరమైన చోట ఎగ్జిట్​పాయింట్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి వెహికిల్స్​ ఏవీ రాంగ్​ రూట్​లో వెళ్లకుండా చూడాలి. కోళ్లపల్లి వద్ద నిరుపయోగంగా ఉన్న టోల్​గేట్​వద్ద హైవే మధ్యలో ఉన్న డివైడర్లను తొలగించాలి.