- రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు
- మద్యం మత్తులో రేప్ లు, మర్డర్లు
- రోడ్డున పడుతున్న కుటుంబాలు
- ఆదాయం కోసం లిక్కర్ను ప్రోత్సహిస్తున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: లిక్కర్ ప్రజల ప్రాణాలను తీస్తోంది. కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. రాష్ట్రంలో మద్యం కారణంగా జరుగుతున్న నేరాలు, మరణాలూ రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ మధ్య డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు ఎక్కువయ్యాయి. కొంతమంది తాగి బండ్లు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ చేయొద్దని రూల్స్ ఉన్నప్పటికీ.. తమ లైఫ్ను రిస్క్లో పెట్టడంతో పాటు ఇతరుల జీవితాలను రిస్క్లో పెడ్తున్నారు. ఎంజాయ్ మెంట్ పేరుతో తాగడం, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేయడం కామన్ అయిపోయింది. ఈ ట్రెండ్ హైదరాబాద్లో మరీ ఎక్కువైంది. శని, ఆదివారాల్లో పరిస్థితి దారుణంగా ఉంటోంది. ఇటీవల ఒకే రోజు జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. డ్రంకన్ డ్రైవ్పై పోలీసులు నిఘా పెట్టినప్పటికీ ఫలితం ఉండటం లేదు.
మద్యానికి బానిసై..
కొంతమంది ఫుల్లుగా తాగి, మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. తాగిన రిమ్మలో భార్య, చెల్లి, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు అనే బంధాలను మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు. మైకంలో రేప్ లు చేసి, అది ఎక్కడ బయటపడుతుందోనని బాధితులను చంపేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో 60 మంది ఖైదీలపై సర్వే చేయగా.. వారిలో 35 మంది మద్యానికి బానిసై నేరాలు చేసినట్లు తేలింది. మరో 28 మంది తాగిన మత్తులోనే దారుణాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఒకటి కంటే ఎక్కువ సార్లు నేరం చేసి జువనైల్ హోమ్కు వచ్చినోళ్లలో 90% మందికి ఆల్కహాల్, గంజాయి అలవాటు ఉన్నట్లు తేలింది. మరికొంత మంది తాగితాగి వాళ్ల ప్రాణాలు వాళ్లే తీసుకుంటున్నారు. తాగుడుకు బానిసై ఆస్తులు అమ్ముకుంటున్నారు. లిమిట్ లేకుండా తాగడంతో ఎక్కువ మందికి లివర్, కిడ్నీలు పాడైపోతున్నాయి. మద్యం కారణంగా వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
సేల్స్ పెంచాలంటున్న సర్కార్..
మద్యం కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ, సర్కార్ మాత్రం లిక్కర్ సేల్స్ పెంచాలంటూ ఆబ్కారీ శాఖ అధికారులను ఆదేశిస్తోంది. ఇప్పటికే జోరుగా లిక్కర్ సేల్స్ ఉండటం, మస్తుగా ఆదాయం వస్తుండటంతో.. ఇంకింత ఇన్కమ్ రాబట్టుకునేందుకు సేల్స్ను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం మరో 404 దుకాణాలకు, 159 కొత్త బార్లకూ పర్మిషన్ ఇచ్చింది. పల్లెల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తోంది.