- పేదలపై కాదు.. పెద్దోళ్లపై పన్నులు వసూలు చేయాలని కోరుకుంటున్న జనం
- బలమైన సోషల్ సెక్యూరిటీ స్కీమ్ తేవాలి
- ఆరోగ్యం, పెన్షన్ కోసం ఎక్కువ ఖర్చు చేయాలి
- వెల్లడించిన ఫియా సర్వే
న్యూఢిల్లీ: కరోనా కాలంలో బాగా సంపాదించిన ఇండివిజువల్స్పై, కంపెనీలపై ఎక్కువ పన్ను వేయాలని జనం కోరుకుంటున్నట్టు ఫైట్ ఇనీక్వాలిటీ అలయన్స్ ఇండియా (ఫియా ఇండియా) చేసిన సర్వే పేర్కొంది. ఇది తయారు చేసిన రిపోర్టు ప్రకారం.. సంవత్సరానికి రూ.2 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారిపై ప్రభుత్వం 2శాతం కోవిడ్–-19 సర్ఛార్జ్ విధించాలని 84 శాతం మంది కోరుతున్నారు. మహమ్మారి సమయంలో భారీ లాభాలు సంపాదించిన సంస్థలపై తాత్కాలిక పన్ను విధించాలని 89.3శాతం మంది సూచించారు. 2022–-23 కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ప్రభుత్వం నుండి సామాన్యుడు ఏం కోరుకుంటాడో తెలుసుకోవడానికి ఫియా 24 రాష్ట్రాల నుండి 3,231 మందితో మాట్లాడింది. యూనివర్సల్ సెక్యూరిటీ స్కీమ్ తేవాలని, రైట్ టూ హెల్త్ కోసం, లింగ ఆధారిత హింసను నిరోధించడానికి బడ్జెట్ను పెంచాలని 90శాతం కంటే ఎక్కువ మంది డిమాండ్ చేశారని ఎన్జీఓలు, పౌర సమాజం, ట్రేడ్ యూనియన్స్, సోషల్ మూవ్మెంట్స్ సంఘాలతో కూడిన ఫియా ఇండియా సర్వే వెల్లడించింది.
కరోనా సమయంలో ఇండియా బిలియనీర్ల సంపద దాదాపు రెట్టింపు కాగా, 4.6 కోట్ల మంది జనం కఠిన పేదరికంలోకి వెళ్లారు. ఈ సంఖ్య ప్రపంచంలో సగం మంది పేదలకు సమానమని ఫియా నిర్వహించిన గ్లోబల్ స్టడీ పేర్కొంది. మనదేశంలోని 98 మంది బిలియనీర్ల సంపద ఇండియాలోని 40 శాతం జనాభా ఆదాయానికి సమానం. కరోనా కారణంగా ఆర్థిక, సామాజిక అసమానతలు ఎక్కువయ్యాయి. సెకండ్ వేవ్ సమయంలో దాదాపు కోటి మంది జాబ్స్కు దూరమయ్యారు. దాదాపు 97 శాతం కుటుంబాల ఆదాయం తగ్గింది. ఇండియన్ బిలియనీర్ల ఆస్తుల విలువ మాత్రం రెట్టింపు అయిందని ఆక్సఫామ్ ఇండియా రిపోర్టు వెల్లడించింది. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు, ప్రమాద బీమా, జీవిత బీమా ప్రయోజనాలు అందించడంతోపాటు ,అసంఘటిత కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలని 94.3 శాతం మంది రెస్పాండెంట్లు కోరారు. షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్ తెగలకు (ఎస్సీ,ఎస్టీలు) ఈ ప్రయోజనాలను ఇవ్వాలని 97 శాతం మందికిపైగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడటానికి పెట్టిన రూల్స్ను పట్టించుకోని కంపెనీలకు ఫైన్ వేయాలని 89 శాతం మంది సూచించారు. రైట్ టూ హెల్త్ కార్యక్రమాన్ని తీసుకురావాలని 94.4 శాతం మంది రెస్పాడెంట్లు కోరారు.
కరోనా వల్ల ఏర్పడ్డ అసమానతలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకోవచ్చు. ఈ సమస్యలపై ప్రపంచమంతటా పోరాటాలు జరుగుతుతున్నాయి. ధనికులు తమ సంపద నుంచి కొంత సమాజానికి ఇవ్వాలి. జనం నాడిని ప్రభుత్వం తెలుసుకోవాలి. సోషల్ సెక్యూరిటీ, హెల్త్ కోసం, పేదలకు మంచి జీవితం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి’’
-ఏంజెలా తనేజా, లీడ్, ఫియా ఇండియా