పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు.. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు.. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం

ములుగు, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.12 వేల జరిమానా విధిస్తూ గురువారం జిల్లా జడ్జి సూర్య చంద్రకళ తీర్పు చెప్పారు. కేసు వివరాలను ఎస్పీ పి.శబరీశ్​ ​మీడియాకు వివరించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట పంచాయతీ పరిధిలోని గుర్రంపేటకు చెందిన మంతెన రామయ్య 2023లో అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై ఏటూరునాగారం పోలీస్​స్టేషన్​లో పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడినై నేరం రుజువు కావడంతో ఈ మేరకు తీర్పు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. బాధితురాలికి రూ.10 లక్షల నష్ట పరిహారం అందజేయాలని ఆదేశించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారి సంకీర్త్​తో పాటు అడిషనల్  ఎస్పీ శివం ఉపాధ్యాయను ఎస్పీ అభినందించారు.