
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక హీరోయిన్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ప్యాన్ ఇండియా రేంజ్లో రెండు భాగాలుగా మైత్రి సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. బన్నీ, విలన్గా నటిస్తున్న మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ కాంబినేషన్లో సీన్స్ తీయబోతున్న సమయంలో సెకెండ్ వేవ్ వల్ల షూటింగ్కి బ్రేక్ పడింది. ఇప్పుడు పరిస్థితులు కొంత కుదుట పడుతూ ఉండటంతో ఈ నెలాఖరు నుండి నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. జులై నెలాఖరుకి షూటింగ్ కంప్లీట్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఎంత హిట్ అవుతాయో, యాక్షన్ సీన్స్ కూడా అంతే హైలైట్ అవుతాయి. ‘పుష్ప’లోనూ అలాంటి హై రేంజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయట. ఆల్రెడీ టీజర్లో వాటిని కొంత పరిచయం చేశారు. అయితే ఈ సినిమాలో బోట్ ఫైట్ స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు. ఇందు కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో, మునుపెన్నడూ ఇండియన్ స్క్రీన్పై చూడని విధంగా ఈ సీన్స్ కంపోజ్ చేస్తున్నారని టాక్. దీనిలో నిజానిజాల మాటెలా ఉన్నా, పది ‘కే.జీ.ఎఫ్’ల రేంజ్లో పుష్ప సినిమా సీన్స్ ఉండబోతున్నాయని సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ టీజర్ తాజాగా డెబ్భై మూడు మిలియన్ వ్యూస్, 1.7 మిలియన్ లైక్స్ని క్రాస్ చేసింది. దాంతో ఈ ఏడాది సెకెండాఫ్లో రాబోతున్న ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్, బన్నీ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్గా నిలుస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి.