ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు. తన ప్రేయసి నయానిక రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నారు. వీరి వివాహం 2026, మార్చి 6న ఘనంగా జరగనుంది. ఇప్పటికే, అల్లు వారి ఇంట స్టార్స్ మీటింగ్స్, దుబాయ్లో పార్టీస్, పసుపు దంచుడు, హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ-వెడ్డింగ్ పార్టీని నిర్వహించారు. అయితే, అల్లు శిరీష్, నయనికా రెడ్డి జంటకు అల్లు అర్జున్ హైదరాబాద్లో ఇచ్చిన కాక్టెయిల్ పార్టీ హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళితే..
బన్నీ హోస్ట్ చేసిన 'కాక్టెయిల్ పార్టీ' వైరల్?
ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక కాక్టెయిల్ పార్టీకి రామ్ చరణ్ హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పార్టీ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలో రామ్ చరణ్ పార్టీకి హాజరైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన అయ్యప్ప మాల వేసుకుని ఆల్కహాల్ సర్వ్ చేసే పార్టీకి వెళ్లడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీక్షలో ఉన్న వ్యక్తులు కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుందని, అలాంటిది ఇలాంటి పార్టీకి ఎలా అటెండ్ అవుతారని కొందరు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళు నల్లటి దుస్తులు ధరించడం, పాదరక్షలు లేకుండా నడవడం, నేలపై నిద్రించడం, బ్రహ్మచర్యం పాటించడం, ఉల్లి, వెల్లుల్లి, ఆల్కహాల్ వంటివి తీసుకోకుండా కేవలం శాకాహారం మాత్రమే భుజించడం లాంటివి చేస్తుంటారు. అలాంటింది ఆల్కహాల్ సర్వ్ చేసే పార్టీకి రామ్ చరణ్ వెళ్లడంతో చర్చకు దారీ తీసింది.
అల్లు శిరీష్ వివరణ:
ఈ క్రమంలో ఓ నెటిజన్ "చరణ్ స్వామి" అని కామెంట్ చేయగా.. శిరీష్ వెంటనే స్పందిస్తూ..“స్వామి (రామ్ చరణ్) మేము ఎవ్వరం మద్యం తాగక ముందే వచ్చారు. మమ్మల్ని ఆశీర్వదించి వెంటనే వెళ్లిపోయారు. అయ్యప్ప స్వామిపై ఆయనకు ఉన్న భక్తి, కట్టుబాటు అభినందనీయం” అని శిరీష్ క్లారిటీ ఇచ్చాడు.
ఈ క్రమంలో రామ్ చరణ్ పై ఉన్న సందేహాలకు, క్లారిటీ రావడంతో చర్చ సద్దుమణిగింది. ఇలా మొత్తానికి, అయ్యప్ప దీక్షలో ఉన్నప్పటికీ రామ్ చరణ్ ఎలాంటి నియమాలు ఉల్లంఘించలేదని, పార్టీ ప్రారంభానికి ముందే వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి వెళ్లిపోయారని అల్లు శిరీష్ స్పష్టంచేశారు. ఈ వివరణతో సోషల్ మీడియాలో వినిపించిన ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది.
రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష ఆచరణ
రామ్ చరణ్ గత రెండు దశాబ్దాలుగా అయ్యప్ప దీక్షను క్రమం తప్పకుండా ఆచరిస్తున్నారు. ఈ 41 రోజుల దీక్షలో భాగంగా భక్తులు నల్ల దుస్తులు ధరిస్తారు, నేలపై నిద్రిస్తారు, పాదరక్షలు లేకుండా నడుస్తారు. అలాగే సాత్వికాహారం మాత్రమే తీసుకుంటారు; ఉల్లిపాయ, వెల్లుల్లి, మద్యం వంటి వాటికి దూరంగా ఉంటారు. ఆత్మపరిశీలన, నియమ నిష్ఠలతో ఈ దీక్షను నిర్వహిస్తారు. దీక్ష అనంతరం భక్తులు శబరిమళను దర్శించుకుంటారు.
స్టార్ల సందడి:
ఈ కాక్టెయిల్ పార్టీకి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అందులో శ్రీలీల, రానా వైఫ్ మిహీక బజాజ్, నిధి అగర్వాల్, రాశి ఖన్నా, కృతిశెట్టి, నేహా శెట్టి, ఫారియా అబ్దుల్లా మరియు ఇతర ప్రముఖ స్టార్స్ ఈ వేడుకలో పాల్గొన్నారు. అల్లు శిరీష్ ఈ వేడుక ఫోటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ, ఈ ప్రత్యేక వేడుకను తనకు మరియు నయనికాకు మరపురాని అనుభవంగా అభివర్ణించారు.
ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ..“నాకు మరియు నయనికకు అర్జున్ & స్నేహ ఇచ్చిన పార్టీ ఎంతో పిచ్చిగా ఉంది. రోహిత్ గాంధీ-రాహుల్ ఖన్నా డిజైన్ చేసిన ఆల్-బ్లాక్ అవుట్ఫిట్స్లో మేమిద్దరం అదిరిపోయాము” అని శిరీష్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
