
- ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ల సేవలను పెంచడానికి డాక్టర్లు కృషి చేయాలని సూచన
- కొండాపూర్లోనూ ఐవీఎఫ్ కేంద్రం ప్రారంభిస్తామని వెల్లడి
- గాంధీ హాస్పిటల్ ను సందర్శించిన మంత్రి
- స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తామని ప్రకటన
పద్మారావునగర్, వెలుగు: రూల్స్ బ్రేక్ చేసిన ఐవీఎఫ్ సెంటర్లపై చర్యలు తప్పవని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. రాష్ర్టంలో 379 ఐవీఎఫ్ కేంద్రాలు ఉంటే ఒక్క హైదరాబాద్లోనే 150కి పైగా ఉన్నాయని తెలిపారు. మంగళవారం వైద్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి గాంధీ హాస్పిటల్ను సందర్శించారు. ఇటీవల పత్రికల్లో గాంధీ దవాఖాన గురించి చాలా వార్తలు వస్తున్నాయని, గాంధీలో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి వచ్చానని చెప్పారు.
ఓపీ బ్లాక్లోని పలు వైద్య విభాగాలను పరిశీలించి ఔట్ పేషెంట్లతో మాట్లాడారు. ఎంసీహెచ్ బిల్డింగ్ కు వెళ్లి ఐవీఎఫ్సెంటర్ను సందర్శించి, కేసుల పురోగతి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మెయిన్ బిల్డింగ్లోని కాన్ఫరెన్స్హాల్ లో డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, వివిధ డిaపార్ట్మెంట్ల హెచ్ఓడీలతో రివ్యూ నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.
గాంధీలో ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి, అడ్మినిస్ర్టేషన్లో లోపాలు లేకుండా ఓ స్పెషల్ ఆఫీసర్ను నియమిస్తామని తెలిపారు. 12 మంది బయోమెడికల్ ఇంజినీర్ల అవసరం ఉందని, ఈ పోస్టులను క్రియేట్చేస్తామన్నారు. సీఎస్ఆర్ కింద గాంధీలో వివిధ పనులు చేయడానికి ఐసీఐసీఐ, పవర్గ్రిడ్, ఎన్టీపీసీ సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. రూ.5 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ర్టంలోనే మొదటి ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ గాంధీ ఎంసీహెచ్లో చక్కగా పనిచేస్తున్నదని, ఇప్పటివరకు 23 కేసులను ఎంపిక చేశామని, ఇందులో రెండు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయని పేర్కొన్నారు.
ప్రైవేట్ఐవీఎఫ్ సెంటర్లకు దీటుగా ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ల సేవలను పెంచడానికి డాక్టర్లు కృషి చేయాలన్నారు. త్వరలో కొండాపూర్లో ఐవీఎఫ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గాంధీలోని ఔట్సోర్సింగ్ సిబ్బంది నాలుగు నెలల పెండింగ్ జీతాలు త్వరలోనే చెల్లిస్తామన్నారు.
ఏడాదికోసారి ట్రాన్స్ఫర్లు చేపట్టాలి
ప్రభుత్వ డాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహాకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) గాంధీ యూనిట్ నేతలు వినతిపత్రం ఇచ్చారు. కెరీర్ అడ్వాన్స్మెంట్, టైం బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలన్నారు. డాక్టర్లకు ప్రతీ ఏడాది ట్రాన్స్ఫర్లు నిర్వహించాలని కోరారు. టీజీడీఏ గాంధీ యూనిట్ ప్రెసిడెంట్ భూపేందర్రాథోడ్, సెక్రటరీ జనరల్ అబ్బయ్య, నాయకులు మురళి, కల్యాణ్ చక్రవర్తి, రవి, సుబోధ్ కుమార్, నవీన్ పాల్గొన్నారు.