Moral Story: సొంత సంపాదన.. పక్షులు కూడా ఆహారాన్ని వెతుక్కుంటాయి..

Moral Story: సొంత సంపాదన.. పక్షులు కూడా ఆహారాన్ని వెతుక్కుంటాయి..

పచ్చని గొడుగు విచ్చుకున్నట్టు విశాలంగా ఉన్న చింత చెట్టు పైన రకరకాల పక్షులు, ఉడుతలు గూళ్లు కట్టుకొని వాటి సంతానాన్ని పెంచుకోసాగాయి. పక్షులు పంటపొలాల నుంచి ధాన్యపు గింజల్ని తెచ్చి పిల్లలకు తినిపించేవి. ఉడుతలు ఆహారాన్ని వెతుక్కుంటూ రకరకాల పండ్లను, గింజల్ని తిని చీకటిపడే వేళకు గూటికి చేరుకునేవి. ఒకరోజు ఉడుతలకు మేత దొరక్క చాలాదూరం వెళ్లవలసివచ్చింది. తల్లితోపాటు మేతకు వెళ్లిన ఉడుత పిల్ల అలసిపోయింది. సాయంత్రం నెమ్మదిగా తల్లితోపాటు గూటికి చేరింది. 

తెల్లవారగానే ఉడుతలన్నీ మేతకు బయలుదేరాయి. ఉడుత పిల్ల నీరసంగా ఉండటం చూచి తల్లి బాధపడింది. ‘‘ఈ రోజుకి విశ్రాంతి తీసుకో బిడ్డా! నీకోసం ఎంతదూరమైనా వెళ్లి. నీకు ఇష్టమైన గింజలు తెచ్చిపెడతాను. కడుపునిండా తిందువుగాని” అంటూ బుజ్జగించి మేతకు బయలుదేరింది.

ఉడుత పిల్ల గూటిలో ముడుచుకుని నిద్రపోయింది. కొంతసేపటికి ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఉడుత పిల్ల బయటకు తొంగిచూసింది. గుంపులుగా వస్తున్న పక్షుల్ని చూసి గూళ్లలోని పక్షి పిల్లలు నోళ్లు తెరచి అరుస్తున్నాయి. పంట పొలాల నుంచి తెచ్చిన గింజల్ని తల్లి పక్షులు పిల్లల నోట్లో వేసి తినిపిస్తున్నాయి. ఆ సమయంలో కొన్నిగింజలు పిల్లల నోటి నుంచి జారి కింద పడుతున్నాయి.ఈ సంగతి గమనిస్తున్న ఉడుత పిల్లకు ఒక ఉపాయం తట్టింది. గూటి నుండి బయటకొచ్చి చెట్టు కిందకు చేరింది. తల పైకెత్తి చూస్తే ధాన్యపు గింజల వర్షం కురుస్తున్నట్లు అనిపించింది. దొరికిన గింజను దొరికినట్టు నోట్లో వేసుకొని ఆకలి తీర్చుకుంది.

 తల్లి వచ్చే వేళకు గూటిలోకి చేరి బాధ నటిస్తూ మూలగసాగింది. గూటికి చేరిన తల్లి ఉడుత బిడ్డ బాధను చూచి తల్లడిల్లిపోయింది. ‘‘ఇదిగో బిడ్డా! నీకోసం రుచికరమైన గింజలు తెచ్చాను తిను” అంటూ తినిపించింది. తల్లి తెచ్చిన గింజల్ని తిని ఉడుత పిల్ల హాయిగా నిద్రపోయింది. ప్రతిరోజూ ఏదో ఒక రోగం పేరు చెప్పి మేతకు వెళ్లడం మానేసింది ఉడుత పిల్ల. చెట్టుకింద రాలిపడిన గింజల్నే కాక తల్లి తెచ్చిన గింజల్ని కూడా తింటూ కాలం గడపసాగింది. 

నెలలు గడిచిపోతున్నా బిడ్డ మేతకు రాకపోవడంతో తల్లికి ఆహార సంపాదన కష్టంగా మారింది. రోజుకో రోగం పేరుచెప్పి తప్పించుకుంటున్న ఉడుత పిల్ల మాటలపై సందేహం కలిగింది. ఉడుత పిల్లను దూరం నుంచి గమనించడం మొదలుపెట్టింది. 

ఒకరోజు రాలిన గింజల్ని తింటుండగా అక్కడికి ఒక కుందేలు గెంతుకుంటూ వచ్చింది. అంత పెద్ద శరీరాన్ని చూచి ఉడుత పిల్ల భయపడింది. ‘‘ఎవరు మీరు’’ అంటూ వణికిపోతూ అడిగింది. ‘‘ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఉడుతలన్నీ మేతకు వెళితే, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావ్” అంటూ బెదిరించింది కుందేలు. ‘‘ఆరోగ్యం బాలేక మేతకు వెళ్లలేకపోయాను. ఇదిగో ఈ చెట్టు కింద రాలిన గింజల్ని తిని ఆకలి తీర్చుకుంటున్నా’’ అంటూ దీనంగా బదులిచ్చింది ఉడుత పిల్ల.

‘‘ఛీ.. ఛీ.. సోమరిపోతా! అబద్ధం చెప్పకు కష్టపడకుండా వచ్చిన ఎంగిలి గింజలు తిని ఒళ్లు పెంచుకుంటున్నావ్. తోటివాళ్లు కష్టపడి ఆహారం సంపాదించుకుంటుంటే రోగం పేరుతో ఒళ్లు దాచుకుంటావా?’’ అంటూ కోపంతో ఊగిపోయింది కుందేలు.‘‘నిజం తెలుసుకోకుండా నిందలు వేయడం మీకు తగునా?’’ అంటూ ఏడవసాగింది ఉడుతపిల్ల. 

‘‘పెద్దదాన్ని గనుకనే బుద్ధి చెప్పడానికి వచ్చా. చేసిందంతా చేసి మొసలి కన్నీరు కారుస్తావెందుకు? అసలు విషయం చెప్తా విను’’ అంటూ ఉడుత పిల్లను దగ్గరకు తీసుకుంది కుందేలు.‘‘మీ అమ్మ నాకు మంచి స్నేహితురాలు. దారిలో కలిసి నీ గురించి చెప్పింది. 

ఒకరోజు మేతకు వెళ్లి వస్తూ గింజలు మేసి, లేని రోగాన్ని నటిస్తున్న నీ మోసాన్ని గ్రహించి బాధ పడిందట. నేరుగా నిన్నే అడగాలనుకున్నా, నిన్ను చిన్నబుచ్చటం ఇష్టంలేక అడగలేకపోయిందట. అదీ తల్లి మనసంటే ఇప్పటికైనా అర్థమైందా?’’ అంటూ వివరించింది.ఆ మాటలు విన్న ఉడుత పిల్ల సిగ్గుతో తలదించుకుంది. తన వల్ల తల్లికి కలిగిన కష్టాన్ని తలచుకుని బాధపడింది.

‘‘ఇప్పుడు బాధపడి ఏం లాభం? ఈ సంవత్సరం వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. ఈ చింత చెట్టు కూడా ఎండిపోవడం మొదలైంది. పక్షులన్నీ గూళ్లను వదిలి వలసపోవడం ప్రారంభించాయి. నేడో రేపో ఈ గింజలు కూడా కరువైపోతాయి. నీకు ఆహారం కోసం వెతుకులాటతప్పదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని, ఆహారం సంపాదించడం అలవాటుచేసుకో’’ అని చెప్పి ముందుకు నడిచింది కుందేలు.

తప్పు తెలుసుకున్న ఉడుత పిల్ల, తల్లి గూటికి రాగానే క్షమాపణ వేడుకుంది. అప్పటినుంచి మేతకు వెళ్లడం మొదలుపెట్టింది. సొంతంగా ఆహారాన్ని సంపాదించడం అలవాటు చేసుకుంది. కష్టపడి పనిచేయడంలో ఉన్న ఆనందాన్ని తిరిగి పొందగలిగింది.

–డా. పోతగాని సత్యనారాయణ–