
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha)పై తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ (Mansoor Ali Khan) చేసిన కామెంట్స్ ఎంత దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో చాలా మంది స్టార్స్ త్రిషకు అండగా నిలిచారు. మన్సూర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీంతో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంది అని గమనించిన మన్సూర్.. త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదం అక్కడితో మగిసింది.. అనుకున్నారంతా కానీ.. త్రిషకు క్షమాపణలు చెప్పిన మరుసటి రోజే మీడియా ముందుకు వచ్చిన మన్సూర్ ఆలీ ఖాన్.. త్రిష, ఖుష్బూ, చిరంజీవిలకు పరువునష్టం నోటీసులు పంపిస్తున్నానంటూ సంచలన కామెంట్స్ చేశారు. చెప్పినట్లుగానే.. శుక్రవారం(డిసెంబర్ 8) త్రిష, ఖుష్బూ, చిరంజీవిలపై మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇందులో భాగంగా మన్సూర్ తన తరుపు లాయర్ ధనంజయన్ ద్వారా కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్లో కోరారు. తాను మాట్లాడిన వీడియోను పూర్తిగా చూడకుండానే తన పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు మన్సూర్. ఇక ఈ కేసు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ ధర్మాసనం ముందు డిసెంబర్ 11న విచారణకు రానుంది.