ప్రజాకవి అందెశ్రీ మృతిపై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సంతాపం తెలిపారు. ప్రజాకవి అందేశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు యావత్ ప్రపంచ తెలుగు జాతికి తీరని లోటన్నారు. ఆయన తన చిత్రాలు ఊరు మనదిరా, ఎర్ర సముద్రం, వేగు చుక్కలకు అమోఘ మైన పాటలు ఇచ్చి చిత్ర విజయాలకు ఎంతో దోహదం చేశారని చెప్పారు. ఎర్ర సముద్రంలో మాయమైపోతున్నాడు అమ్మ మనిషి అన్న వాడు అనే పాట తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ముద్రించబడింది. అది ఆ పాట గొప్పతనం.
ఊరు మనదిరా లోని చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి అనే పాట తెలంగాణా ఉద్యమంలో అమోఘమైన రోల్ ప్లే చేయడమే కాదు నాటికి నేటికి ఏ నాటికి చిరస్థాయిగా ఉంటుందన్నారు. అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అనే పాట కూడా అంతే బాగుంటుంది. అన్నిటినీ మించి జయ జయహే తెలంగాణా పాటతో అందెశ్రీ తన జన్మ ధన్యం చేసుకున్నారని తెలిపారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించి అమలు చేస్తుందన్నారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు ఆర్ నారాయణ మూర్తి.
అందెశ్రీ నవంబర్ 10న ఉదయం హైదరాబాద్ లాలాగూడలోని ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు. నవంబర్ 11న ఉదయం ఘట్ కేసర్ లో అందే శ్రీ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
