కరోనా నుంచి కోలుకుని పక్షవాతానికి గురైన బాలీవుడ్ నటి

కరోనా నుంచి కోలుకుని పక్షవాతానికి గురైన బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా ఇటీవల కరోనా నుంచి కోలుకుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే పక్షవాతానికి గురైంది. శిఖా పక్షవాతంతో బాధపడుతోందని..ఆమె కుడివైపు భాగం అచేతనంగా మారిందని ఆమె మేనేజర్ అశ్వని శుక్లా తెలిపారు. సరిగా మాట్లాడలేకపోతోందని తెలిపాడు. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఫ్యాన్’ సినిమా ద్వారా శిఖా మల్హోత్రా గుర్తింపు తెచ్చుకుంది.

కరోనా లాక్ డౌన్ సమయంలో శిఖా మల్హోత్రా సామాజిక స్ఫూర్తిని చాటుతూ ఓ నర్సుగా మారి కరోనా రోగులకు సేవలందించారు. శిఖా సినిమాల్లోకి రాకముందు నర్సింగ్ కోర్సు చేసింది. తన విద్యకు సార్థకత చేకూర్చుతూ లాక్ డౌన్ సమయంలో స్వచ్ఛంద సేవలందించింది. ఈ క్రమంలో ఆమె కూడా గత అక్టోబరులో కరోనా బారినపడింది. కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది. తాజాగా పక్షవాతానికి గురికావడంతో శిఖాను కుటుంబ సభ్యులు ముంబైలోని జుహూస్ కూపర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.