మోగా(పంజాబ్): చరణ్జిత్ సింగ్ చన్నీ పంజాబ్ సీఎంగా 3 నెలలె పనిచేసినా అందరి ప్రశంసలు, మన్ననలు పొందారని బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ అన్నారు. అయితే సడెన్గా ఎన్నికల రూపంలో ఆయనకు టీ బ్రేక్ వచ్చిందని, ఈ బ్రేక్ అయ్యాక ఆయన మళ్లీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. చన్నీకి ఎక్కువ టైమ్ దొరకనందున మరో చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తాను పార్టీ నాయకత్వాన్ని కలిసినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించానని చెప్పారు. అదేవిధంగా తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిజాయితీపరుడని, మంచి వ్యక్తి అని పొగిడారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం క్యాండిడేట్ భగవంత్ మాన్ను పొలిటికల్గా తాను ఎప్పుడూ ఫాలో కాలేదని, యాక్టర్గా గతంలో ఒకసారి ఆయనను కలిశానని తెలిపారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై ఆప్ నాయకత్వం మరోసారి ఆలోచించాలన్నారు. చాలాకాలంగా సామాజిక సేవలో పాల్గొంటున్న తన సిస్టర్కు మద్దతు ఇస్తున్నానని సోనూ స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ?
మోగాలో స్కూళ్లు, కాలేజీలో, ధర్మశాలలు అన్నీ తమ ఫ్యామిలీనే నిర్మించిందని సోనూ తెలిపారు. తన అమ్మ చాలా మంది పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పిందని గుర్తుచేశారు. తాను, తన సిస్టర్ తమ పేరెంట్స్ మార్గంలో నడుస్తున్నామని చెప్పారు. మోగాలో తన సిస్టర్ మాళవిక సగం మందికి కరోనా వ్యాక్సిన్ను వేయించిందన్నారు. మాళవిక రాజకీయాల్లో వస్తే ఇంకా చాలా పనులు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని, వాళ్లే ఆమెను పాలిటిక్స్లోకి తీసుకొచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తాను రాజకీయాల్లోకి వస్తానని సోనూసూద్ హింట్ ఇచ్చారు.