
హైదరాబాద్, వెలుగు: యాక్టర్ విజయ్ దేవరకొండ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల విచారణకు హాజరయ్యారు. లైగర్ సినిమా షూటింగ్స్, పేమెంట్లపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన మేరకు విజయ్ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు వచ్చారు. తన మేనేజర్తో కలిసి స్పెషల్ టీమ్ ముందు హాజరయ్యారు. అధికారులు విజయ్ను రాత్రి 9 గంటల వరకు ప్రశ్నించారు. లైగర్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు? విదేశాల్లో ఖర్చులకు డబ్బు ఎవరు సమకూర్చారనే వివరాలను రికార్డు చేశారు. ఆయన మేనేజర్ను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. డబ్బు ఏ రూపంలో వచ్చిందనే కోణంలో ప్రశ్నించారు. బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా స్పెషల్ టీమ్ ప్రశ్నించింది. ఇదే కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి చార్మీని ఈ నెల 17న ఈడీ అధికారులు విచారించారు.
హాలీవుడ్ నటులకు డబ్బు ఎలా చెల్లించారు?
లైగర్ సినిమా షూటింగ్స్ కోసం పెద్ద మొత్తంలో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. విదేశాల్లో జరిగిన షూటింగ్స్, అందుకు డబ్బు ఎవరిచ్చారు? రెమ్యూనరేషన్ తదితర వివరాలు రాబడుతున్నది. అందులో భాగంగానే మైక్ టైసన్తో పాటు హాలీవుడ్ యాక్టర్లకు ఇచ్చిన రెమ్యూనరేషన్ గురించి అధికారులు విజయ్ దేవరకొండను, ఆయన మేనేజర్ను ఆరా తీసినట్లు తెలిసింది. షూటింగ్లకు కావాల్సిన డబ్బు ఎలా తరలించారు? దీనికి సంబంధించిన అగ్రిమెంట్లు, నిర్మాతల నుంచి అందిన డబ్బుకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్తో తీసిన ఈ సినిమా కోసం రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు కూడా పెట్టుబడి పెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేపడుతోంది.
వాళ్లడిగిన్రు.. నేను క్లారిటీ ఇచ్చిన
విచారణ ముగిసిన తర్వాత ఈడీ ఆఫీస్ ఎదుట విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారులు కొన్ని విషయాలపై క్లారిఫికేషన్లు అడిగిన్రు. నేను చెప్పిన. వాళ్ల జాబ్ వాళ్లు చేస్తున్నరు. 12 గంటలపాటు లోపట్నే ఉన్న. ఐటీ వాళ్లు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పిన. పాపులారిటీతో పాటు కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. అన్ని వివరాలు చెప్తే వాళ్లు ఫీలయితరు’’ అని దేవరకొండ అన్నారు.