
రేవ్ పార్టీ కేసులో అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు
అనేకల్ నాలుగో అదనపు సివిల్, జేఎంఎఫ్సీ కోర్టులో హాజరు
జూన్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన న్యాయస్థానం
హైదరాబాద్: రేవ్పార్టీ, డ్రగ్స్ కేసులో సినీ నటి హేమ అరెస్టయింది. బెంగళూరు సీసీబీ పోలీసుల ఎదుట సోమవారం ఆమె విచారణకు హాజరయ్యింది. విచారణ అనంతరం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ ఆర్గనైజర్ వాసుతో కలిసి రేవ్పార్టీలో డ్రగ్స్ సప్లయ్ చేసిందనే ఆరోపణలతో ఈ కేసులో హేమను నిందితురాలిగా చేర్చారు. హెబ్బగోడి పీఎస్లో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్తో అనేకల్ నాలుగో అదనపు సివిల్, జేఎంఎఫ్సీ కోర్టులో ఆమెను హాజరుపరిచారు.
జూన్ 14వరకు హేమకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలతో ఆమెను రిమాండ్కు తరలించారు. కాగా, హేమ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు. గత నెల19న రాత్రి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్హౌస్లో రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో లిక్కర్, డ్రగ్స్, గంజాయితో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారనే సమాచారంతో 20వ తేదీ తెల్లవారుజామున సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు. హేమ సహా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో హేమ, మరో 29 మంది యువతులు సహా మొత్తం 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. ఈ కేసులో రెండు సార్లు హేమకు బెంగళూరు పోలీసులు నోటీ సులు ఇవ్వగా.. విచారణకు ఆమె హాజరుకాలేదు. తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చి.. విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేశారు.
మొదటి నుంచి తప్పించుకునే ప్రయత్నం
హేమ అరెస్ట్తో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. బెంగళూరు పోలీసులు హేమ పేరును ప్రస్తావించిన సమయంలో ఆమె వ్యవహరించిన తీరు ఇండస్ట్రీలో వివాదాలకు దారి తీసింది. తను రేవ్ పార్టీలో పాల్గొనలేదని నమ్మించేందుకు హేమ వీడియోస్ రిలీజ్ చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. సీరియస్గా తీసుకున్న పోలీసులు బెంగళూరుకు హేమ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్స్ను సేక రించారు. హేమ నుంచి సేకరించిన శాంపిల్స్లో డ్రగ్ కంటెంట్ పాజిటివ్ రావడంతో నోటీసులు జారీ చేశారు. మొదటి నోటీస్ ఇచ్చిన సమయంలో తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, విచారణకు హాజరుకాలేనని సమాచారం ఇచ్చారు. దీంతో జూన్ 1 హాజరుకావాలని పోలీసులు మరో నోటీసు జారీ చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు హేమ సోమవారం సీసీబీ పోలీసుల ముందు హాజరయ్యారు. ఇన్వెస్టిగేషన్ అధికారులు హేమ నుంచి పూర్తి వివరాలను సేకరించారు డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ ఆధారంగా ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి ఎంతమంది వచ్చారు? డ్రగ్స్ ఎవరు సప్లయ్ చేశారు? అనే వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
ముగ్గురు పోలీసులు సస్పెండ్
ఫామ్హౌస్లో హేమను అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి నుంచే హేమ వీడియో రిలీజ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.హేమ వీడియో రిలీజ్ చేయడంతో పాటు ఫామ్హౌస్లో పార్టీ జరుగుతున్నదని తెలిసికూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెబ్బగోడి పీఎస్కు చెందిన ఏఎస్సై నారాయణస్వామి,హెడ్ కానిస్టేబుల్ గిరీశ్, కానిస్టేబుల్ దేవ రాజుపై సస్పెన్షన్ వేటుపడింది. ఎలక్ట్రానిక్ సిటీలోని జేబీ ఫామ్హౌస్లో న్యూసెన్స్ చేస్తున్నట్టు పలువురు సమాచారం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉన్నతాధికారుల విచారణలో తేలింది. దీంతో బెంగళూరు సీపీ దయానంద ముగ్గురిని సస్పెండ్ చేశారు. పార్టీలో పాల్గొన్న వారితో పాటు డ్రగ్స్ తీసుకున్న వారిని శనివారం నుంచి విచారించనున్నారు.