న్యూఢిల్లీ: భారీ విస్తరణ ప్రాజెక్టుల కోసం రూ. 20 వేల కోట్లను సమీకరించేందుకు మరోసారి ఐపీఓ (ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్–ఎఫ్పీఓ) చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. పోర్టుల నుంచి ఎనర్జీ, సిమెంట్ దాకా వివిధ సెగ్మెంట్లలో విస్తరణ ప్రాజెక్టులను ఈ గ్రూప్ చేపడుతోంది. ఈ ప్రాజెక్టుల అమలుకు అవసరమైన నిధులను ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా సేకరించాలనుకుంటున్నట్లు శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది.
గ్రూప్లోని ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ మార్కెట్ నుంచి రూ. 20 వేల కోట్లను సమీకరిస్తుందని పేర్కొంది. సివిల్ ఏవియేషన్, డేటాసెంటర్ల బిజినెస్లు ఈ కంపెనీ చేతిలోనే ఉన్నాయి. షేర్హోల్డర్ల బేస్ను మరింత పెంచుకునేందుకు, ఇన్వెస్టర్లలో క్రెడిబిలిటీ పెంచుకోవడానికి ఈ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ సాయపడుతుంది అనేది అదానీ గ్రూప్ ఆలోచన.
అదానీ ఎంటర్ప్రైజస్ లిమిటెడ్లో ప్రస్తుతం ప్రమోటర్లకు 72.63 శాతం వాటా ఉండగా, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల చేతిలో మరో 20 శాతం వాటాలు ఉన్నాయి. మిగిలిన వాటాలు పబ్లిక్ దగ్గరున్నాయి. గత ఏడాది కాలంలో అదానీ ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ షేర్లు రెట్టింపయ్యాయి. దీంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 4.46 లక్షల కోట్లకు ఎగిసింది.
ఈ ఏడాది టైములో ఎస్అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ 5.4 శాతం మాత్రమే పెరగడం ఇక్కడ గమనించదగ్గది. ఎఫ్పీఓ ద్వారా రూ. 20 వేల కోట్ల సమీకరణకు డైరెక్టర్ల బోర్డు శుక్రవారం మీటింగ్లో ఆమోదం తెలిపినట్లు అదానీ ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ ఎక్స్చేంజీలకు సమాచారం పంపించింది. ఈ ప్రపోజల్కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల అనుమతి తీసుకోనున్నట్లు వివరించింది. షేర్లలో లిక్విడిటీ పెంచుకోవాలనుకుంటున్నట్లు ఇంతకు ముందే అదానీ గ్రూప్ వెల్లడించింది.