ట్రైన్​మ్యాన్​లో అదానీకి వాటా

ట్రైన్​మ్యాన్​లో అదానీకి వాటా

న్యూఢిల్లీ:  గౌతమ్ అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆన్‌లైన్ రైలు టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ ట్రైన్‌మ్యాన్​ను నిర్వహించే  స్టార్ట్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో(ఎస్​ఈపీఎల్) దాదాపు 30 శాతం వాటాను కొన్నది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ గత నెలలో ఎస్ఈపీఎల్​లో 100 శాతం వాటా కొనేందుకు ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రకటించింది. అయితే శనివారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో మాత్రం అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీకి చెందిన అదానీ డిజిటల్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్​ఈపీఎల్​ లో 29.81 శాతం వాటాను రూ.3.56 కోట్లకు కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. ఎస్​ఈపీఎల్​ 2022–-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.51 కోట్ల టర్నోవర్‌ సాధించింది.  

ట్రైన్‌మ్యాన్‌తో పాటు  రైల్వేస్ టికెటింగ్ విభాగం అయిన ఐఆర్​సీటీసీను కూడా అదానీ  టేకోవర్‌  చేయొచ్చంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్‌ గత నెల విమర్శించారు. దీనిపై ఐఆర్​సీటీసీ స్పందించింది.  మొత్తం ఈ–టికెట్లలో 81 శాతం తమ ప్లాట్​ఫామ్​ నుంచే బుక్ అవుతున్నాయని, ట్రైన్​మ్యాన్​తమకు పోటీ కాదని తెలిపింది.  ఐఆర్​సీటీసీకి బీ2సీ పార్ట్​నర్​ అయిన ట్రైన్‌మ్యాన్​కు మొత్తం రిజర్వ్​డ్​ టికెటింగ్‌లో 0.13 శాతం వరకు వాటా ఉంది. 2011లో వినీత్ చిరానియా,  కరణ్ కుమార్  స్థాపించిన ట్రైన్‌మ్యాన్ జజ  ట్రావెల్​ బుకింగ్ యాప్. దీనిద్వారా ప్రయాణీకులు పీఎన్​ఆర్​ (ప్యాసింజర్ నేమ్ రికార్డ్) స్టేటస్​ను చెక్​ చేసుకోవచ్చు. వెయిట్-లిస్టులో ఉంటే సీటును పొందే అవకాశాన్ని తెలుసుకోవచ్చు. సీటు లభ్యత, ట్రైన్​ స్టేట్​, టైమ్ టేబుల్, కోచ్ పొజిషన్​, ఛార్జీల కాలిక్యులేటర్ మొదలైన సేవలను అందిస్తుంది. ట్రావెల్ బుకింగ్  ఇన్ఫర్మేషన్ విభాగంలో అదానీ గ్రూప్​కు ఇది  రెండవ పెట్టుబడి. 2021 అక్టోబర్ లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆన్‌లైన్ ట్రావెల్ అగ్రిగేటర్ క్లియర్‌ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది.