
- వాటా అమ్మకాల ద్వారా 39 వేల కోట్లు సేకరించిన ప్రమోటర్లు
- వేగంగా కోలుకుంటున్న షేర్లు
- పెట్టుబడులు మరింత పెరిగే చాన్స్
ముంబై: అదానీ గ్రూపులో స్టాక్ మానిప్యులేషన్, మనీలాండరింగ్ వంటివి జరిగాయంటూ అమెరికా సంస్థ హిండెన్బర్గ్చేసిన ఆరోపణల తరువాత ప్రమోటర్లు ఇప్పటి వరకు వాటాల అమ్మకం ద్వారా రూ39,400 కోట్లు సేకరించారు. హిండెన్బర్గ్ ఉదంతం తరువాత ఈ గ్రూపు తన రూ.20 వేల కోట్ల విలువైన ఫాలో ఆన్ ఆఫర్ను కూడా వెనక్కి తీసుకుంది. ఈ డబ్బుతో కొన్ని అప్పులను ముందుగానే తీర్చేశారు. ఇలా చేయడం ద్వారా ఇన్వెస్టర్లలో గ్రూపుపై నమ్మకం పోకుండా చేయగలిగారు. ఈ రూ.39,400 కోట్లలో దాదాపు 90 శాతం పెట్టుబడి రాజీవ్ జైన్కు చెందిన జీక్యూజీ పార్ట్నర్స్ నుంచి వచ్చింది. దీని ఏయూఎం విలువ 104 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. ఆల్ఫానిటీ ఫిన్టెక్ డైరెక్టర్ భట్ మాట్లాడుతూ అదానీ గ్రూపు ప్రమోటర్లు రెన్యువల్ ఎనర్జీకి సంబంధించిన “కొత్త వ్యాపారాలలో” మరిన్ని నిధులను ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గ్రూప్ స్థాయిలో, రీఫైనాన్సింగ్తో కూడిన భవిష్యత్ డెట్ మెచ్యూరిటీ కవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024 ఆర్థిక సంవత్సరం) రూ.11,796 కోట్లు, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.32,000 కోట్లు, 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.16,600 కోట్లుగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ దగ్గర రూ.40,351 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఇటీవల అదానీ గ్రీన్లో రూ.4,135 కోట్ల విలువైన 2.6శాతం వాటాను కొనుగోలు చేసింది. హిండెన్బర్గ్ ఆరోపణలపై సెబీ తుది నివేదిక వచ్చిన తరువాత మరింత మంది విదేశీ పెట్టుబడిదారులు గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టవచ్చని మరో బ్రోకర్ చెప్పారు. మాజీ న్యాయమూర్తి సప్రే నేతృత్వంలో సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్, హిండెన్బర్గ్ రిపోర్టులోని ఆరోపణలపై విచారణ జరిపింది. అదానీ గ్రూప్కు వ్యతిరేకంగా ఆధారాలు లేవని ప్రకటించింది. హిండెన్బర్గ్ ఆరోపణల వల్ల 100 బిలియన్ డాలర్లకు పైగా విలువను కోల్పోయిన అదానీ గ్రూప్ కంపెనీలు, తదనంతరం కోలుకున్నాయి. ఉదాహరణకు, అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం దాని ‘52 వీక్ లో’ రూ.1,017.45 కాగా, ప్రస్తుతం రూ.2,445 వద్ద ట్రేడవుతోంది. అదానీ గ్రీన్ ఫిబ్రవరి 28 నుంచి 116శాతం పెరిగింది. అదానీ పోర్ట్స్ షేర్లు కూడా విపరీతంగా పెరిగాయి.
అదానీ పవర్ షేర్లు 2 శాతం అప్
జిక్యూజీ పార్ట్నర్స్ ఇతర ఇన్వెస్టర్లతో కలిసి కంపెనీలో 8.1 శాతం వాటాను కొనుగోలు చేయడంతో అదానీ పవర్ షేర్లు గురువారం 2 శాతానికి పైగా పెరిగాయి. ఈ డీల్ విలువ రూ. 9,000 కోట్లని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీంతో బీఎస్ఈలో ఈ షేరు 2.58 శాతం లాభపడి రూ.286.50 వద్ద క్లోజయింది. ఎన్ఎస్ఈలో 2 శాతం పెరిగి రూ.285.55 వద్ద ముగిసింది. మెజారిటీ గ్రూప్ కంపెనీలు కూడా గ్రీన్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్ 4.47 శాతం, అంబుజా సిమెంట్స్ 1.91 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.45 శాతం, ఎన్డీటీవీ 1.26 శాతం, ఏసీసీ 0.64 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 0.42 శాతం లాభపడ్డాయి. జీక్యూజీ పార్ట్నర్స్, ఇతర పెట్టుబడిదారులు అదానీ పవర్లో 31.2 కోట్ల షేర్లను బ్లాక్ డీల్లో కొనుగోలు చేశారు. -- ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సెకండరీ మార్కెట్ ఈక్విటీ లావాదేవీలలో ఒకటి. ఇది వరకే జీక్యూజీ మూడు అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. సంస్థలో 74.97 శాతం వాటా ఉన్న ప్రమోటర్ అదానీ కుటుంబం 8.1 శాతం వాటాను షేరు సగటు ధర రూ. 279.17 చొప్పున అమ్మింది.