న్యూఢిల్లీ: రెండు గ్రూప్ కంపెనీల్లో షేర్ల అమ్మకం ద్వారా రూ.21 వేల కోట్లు (2.5 బిలియన్ డాలర్లకుపైగా) సేకరించాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. గ్రూప్కు చెందిన ఫ్లాగ్షిప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ రూ.12,500 కోట్లు, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ అదానీ ట్రాన్స్మిషన్ మరో రూ.8,500 కోట్లు సమీకరిస్తాయని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లలో తెలిపాయి. రెన్యువబుల్ ఎనర్జీ విభాగం, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ బోర్డు కూడా నిధుల సేకరణ కోసం శనివారం సమావేశం కావాల్సి ఉండగా, ఇది ఈ నెల 24వ తేదీకి వాయిదా పడింది.
అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ జరుగుతుంది. యూరప్, మిడిల్ఈస్ట్ దేశాల పెట్టుబడిదారులు షేర్ల కొనుగోలుకు ఆసక్తితో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూపాయి ఫేస్వాల్యూ కలిగిన షేర్లు/సెక్యూరిటీలు లేదా రెండింటి అమ్మకం ద్వారా రూ.12,500 కోట్లు సేకరిస్తామని అదానీ ఎంటర్ప్రైజ్ ప్రకటించింది. తాము రూ.పది ఫేస్వాల్యూ కలిగిన షేర్లు/సెక్యూరిటీలు లేదా రెండింటి అమ్మకం ద్వారా రూ.8,500 కోట్లు రాబడతామని అదానీ ట్రాన్స్మిషన్ వెల్లడించింది. క్విప్లేదా ఇతర విధానాల ద్వారా నిధులు తీసుకుంటామని తెలిపింది.